అదానీతో మోదీకి ఉన్న సంబంధం ఏంటి..!
దేశంలో ప్రజలు పడుతున్న బాధలు తనను కలిచివేశాయన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. భారత్ జోడో యాత్రలో ప్రజల సమస్యలను దగ్గరుండి గమనించానని అన్నారు. లోక్సభలో చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ పలు ప్రజా సమస్యలను లేవనెత్తారు. రైతులు మద్దతు ధర లేక తీవ్ర అవస్థలు పడుతున్నారని తెలిపారు. దేశంలో నిరుద్యోగం పెరిగి పోయిందని, ఉద్యోగాలు లేక యువత దిక్కుతోచని స్థితిలో పడిపోయారని స్పష్టం చేశారు. భారీగా పెరిగిన నిత్యవసరాల ధరలతో సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారని రాహుల్ సభలో తెలిపారు. అదే విధంగా
ప్రధాని నరేంద్ర మోదీని గట్టిగా నిలదీశారు. గుజరాత్కు చెందిన పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీతో ఉన్న సంబంధాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. తాను నిర్వహించిన భారత్ జోడో యాత్ర లో కన్యాకుమారి నుంచి కశ్మీరు వరకు గౌతమ్ అదానీ పేరు మాత్రమే వినిపించిందని అన్నారు. 2014లో 8 మిలియన్ డాలర్లు ఉన్న అదానీ ఆదాయం 2022కల్లా 140 మిలియన్ డాలర్లుకు ఎలా చేరిందని భారత్ జోడో యాత్రలో పలువురు ప్రశ్నించారని రాహుల్ తెలిపారు. ఈ సందర్భంగా మోదీ, అదానీ కలిసి ఉన్న ఫొటోను రాహుల్ లోక్సభలో ప్రదర్శించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com