అసెంబ్లీలో గందరగోళం : పాతబడ్జెట్ ప్రవేశ పెట్టిన రాజస్థాన్ సీఎం
రాజస్థాన్ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఈ ఏడాది బడ్జెట్ కాకుండా గతేడాది బడ్జెట్ను ప్రవేశపెట్టారు. 2023-24 బడ్జెట్కు బదులుగా పట్టణ ఉపాధి, కృషి బడ్జెట్ను చదివారు. వెంటనే విపక్షాలు వెల్లోకి వచ్చి ఆందోళన చేశాయి. ఒక్కసారిగా కలకలం రేగింది. పొరపాటును గమనించిన సీఎం, విపక్ష సభ్యులకు క్షమాపణలు చెప్పారు.
ఎలక్షన్ బడ్జెట్ అంటూ ప్రవేశపెట్టిన గెహ్లాట్ అపహాస్యం పాలయ్యారు. దాదాపు 8నిమిషాల పాటు సీఎం పాత బడ్జెట్ను చదువుతూనే ఉన్నారని మాజీ ముఖ్య మంత్రి వసుంధర రాజే అన్నారు. ఆమె ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బడ్జెట్ను ప్రవేశపెట్టే ముందు చాలా సార్లు పరిశీలించి చదివానని తెలిపారు. పాత బడ్జెట్ను ప్రవేశ పెట్టిన సీఎం చేతిలో రాష్ట్రం ఎంత భద్రంగా ఉందో ఊహించుకోవచ్చని ఆమె విమర్శించారు. కాగా ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇది నిదర్శనమని విపక్షాలు విమర్శిస్తున్నాయి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com