Adani: రేవులన్నీ అదానీ చేతిలోకి ఎలా వెళ్లాయి
అదానీ గ్రూప్ పై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ఫైర్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణపట్నం, గంగవరం రేవులు ఎలా అదానీ పరమయ్యాయని ప్రధాని నరేంద్ర మోదీని కాంగ్రెస్ ప్రశ్నించింది. 2014లో మోదీ ప్రధాని అయినప్పటి నుంచి అదానీ గ్రూప్ గుత్తాధిపత్యం రేవుల్లోకూడా విస్తరించిందని తెలిపింది. మోదీ,అదానీ'బంధంపై ప్రతిరోజూ ప్రశ్నలు సంధిస్తామని ప్రకటించిన కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ పోర్టులపై బహిరంగ లేఖ రాశారు. దేశంలోని 13 రేవులు, టెర్మినల్స్ అదానీ చేతుల్లోకి ఎలా వెళ్లాయని ప్రశ్నించారు.గుజరాత్లో ముంద్రా రేవును నిర్వహిస్తున్న అదానీకి 2015లో ఒడిసాలోని ధమ్రా రేవు దక్కింది. 2018లో కట్టుపల్లిరేవు సొంతమైంది. 2020లో ఆంధ్రప్రదేశ్లోని కృష్ణపట్నం రేవు, ఆ తర్వాతి సంవత్సరం గంగవరం పోర్టు అదానీ సంస్థ దక్కించుకుంది. 2021లో మహారాష్ట్రలోని డిఘి రేవు స్వాధీనపరిచారు అని జైరాం రమేశ్ పేర్కొన్నారు. ఈ రేవులను అదానీ గ్రూప్ స్వాధీనపరుచుకునేందుకు వీలుగా మోదీ ప్రభుత్వం అన్ని శక్తుల్నీ ప్రయోగించిందని జైరాం చెప్పారు. ఎలాంటి వేలం లేకుండా, ప్రభుత్వ రాయితీలతో రేవులను అదానీకి అప్పగించారని తెలిపారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com