wall collapse: ఉప్పు ప్యాకేజింగ్ ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం.. గోడ కూలి 12 మంది కార్మికులు దుర్మరణం

Wall Collapse: గుజరాత్లోని మోర్బీ జిల్లాలో బుధవారం ఉప్పు ప్యాకేజింగ్ ఫ్యాక్టరీ వద్ద గోడ కూలి 12 మంది కార్మికులు మరణించారు. ఇంకా పలువురు కూలీలు శిథిలాల కింద చిక్కుకుపోయి ఉంటారని అధికారులు భావిస్తున్నారు.
హల్వాద్ పారిశ్రామిక ప్రాంతంలోని సాగర్ సాల్ట్ ఫ్యాక్టరీలో ఈ ఘటన జరిగిందని రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే బ్రిజేష్ మెర్జా తెలిపారు. శిథిలాల కింద చిక్కుకున్న ఇతరులను రక్షించే ప్రయత్నాలు ఇంకా కొనసాగుతున్నాయని మెర్జా చెప్పారు.
"గోడ కూలడం వల్ల మోర్బీలో జరిగిన విషాదం హృదయ విదారకంగా ఉంది. ఈ దుఃఖ సమయంలో, నా ఆలోచనలు మృతుల కుటుంబాలతో ఉన్నాయి. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. స్థానిక అధికారులు బాధితులకు అన్ని విధాలా సహాయాన్ని అందిస్తున్నారు' అని మోదీ ట్వీట్ చేశారు.
ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి మృతుల బంధువులకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున పరిహారం అందజేయనున్నట్లు పీఎంవో ట్విట్టర్లో తెలియజేసింది. క్షతగాత్రులకు ఒక్కొక్కరికి రూ.50,000 అందజేస్తామని తెలిపారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఈ దుర్ఘటనపై ట్విట్టర్ ద్వారా సంతాపం వ్యక్తం చేశారు. కొనసాగుతున్న రెస్క్యూ పనుల గురించి గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్తో ఫోన్లో మాట్లాడినట్లు ఆయన తెలిపారు.
ముఖ్యమంత్రి పటేల్ బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 4 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com