Uttar Pradesh: పెళ్లింట విషాదం.. బావిలో పడి 13 మంది మృతి
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్లోని ఖుషినగర్ జిల్లాలోని ఒక గ్రామంలో బావిలో పడి ఒక చిన్నారితో సహా 13 మంది మహిళలు మరణించారు. ఈ ఘటన నెబువా నౌరంగియాలో చోటుచేసుకుంది. బుధవారం వివాహ వేడుకలకు బంధువులు, కుటుంబసభ్యులు హాజరయ్యారు.
హల్దీ వేడుకలో భాగంగా పలువురు మహిళలు, యువతులు బావిపై నిలబడి ఉన్నారు. అకస్మాత్తుగా, బావిపై ఉన్న ఇనుప గ్రిల్ బరువు ఆపుకోలేకపోయింది. దీంతో దానిపై నిలబడిన మహిళలు, యువతులు లోపలికి పడిపోయారు. బావిలో పడిపోయిన 15 మంది మహిళలను గ్రామస్థులు, పోలీసులు రక్షించగా, 13 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఈ దుర్ఘటన అత్యంత విషాదకరమని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంతాపం వ్యక్తం చేశారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని, క్షతగాత్రులకు చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ.4లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com