80వేల మంది పోలీసుల కన్నుగప్పి అమృత్‌పాల్ ఎలా తప్పించుకున్నాడు

80వేల మంది పోలీసుల కన్నుగప్పి అమృత్‌పాల్ ఎలా తప్పించుకున్నాడు
ఈ ఆపరేషన్‌లో ఇంటెలిజెన్స్‌, పోలీసులు ఇద్దరూ విఫలమయ్యారని పేర్కొన్న హైకోర్టు

ఖలిస్థానీ గ్రూపు వార్సీ పంజాబ్‌ దే నేత అమృత్‌పాల్‌ సింగ్‌ను అరెస్ట్‌ చేసేందుకు పంజాబ్‌ పోలీసులు భారీ ఆపరేషన్‌ చేపట్టారు. అయినా 80వేల మంది పోలీసుల కన్నుగప్పి అమృత్‌పాల్‌ తప్పించుకున్నాడు. దీనిపై విచారించిన పంజాబ్‌ హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. 80వేల మంది పోలీసులున్నారు మీరేం చేస్తున్నారు, అమృత్‌పాల్‌ ఎలా తప్పించుకున్నాడని ప్రభుత్వాన్ని నిలదీసింది. ఆపరేషన్‌ రిపోర్ట్‌ సమర్పించాలని కోరింది. ఈ ఆపరేషన్‌లో ఇంటెలిజెన్స్‌, పోలీసులు ఇద్దరూ విఫలమయ్యారని కోర్టు పేర్కొంది. అయితే అమృత్‌పాల్‌ సింగ్‌ను అరెస్ట్‌ చేయాలని శనివారం ఈ ప్రక్రియ ప్రారంభించినట్లు పోలీసులు కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలో ఖలిస్తానీ వేర్పాటు నేత అమృత్‌పాల్‌కు చెందిన 120 మంది మద్దతుదారుల్ని అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు భగ్నం చేయాలనుకునేవారిపై కఠిన చర్యలు తప్పవని సీఎం భగవంత్‌ సింగ్‌మాన్‌ తెలిపారు. దేశానికి వ్యతిరేకంగా పనిచేసే ఏ శక్తిని సహించబోమని, రాష్ట్ర ప్రజలు శాంతిని, ప్రగతిని ఆశిస్తున్నట్లు సీఎం వెల్లడించారు.

ఇంతకూ ఎవరీ అమృత్‌ పాల్‌ సింగ్‌.. 1993 జనవరిలో అమృత్‌సర్‌ సమీపంలోని జల్లూపూర్‌ ఖెహరాలో జన్మించాడు. ఇంటర్‌ వరకు చదువుకున్నాడు, బంధువు వ్యాపారంలో సాయంగా ఉండేందుకు దుబాయ్‌లో కొన్నాళ్లు ఉన్నాడు. అనంతరం అక్కడి నుంచి 2022లో తిరిగి వచ్చిన పాల్‌ జీవితం వారిస్‌ పంజాబ్‌ దే అదినేత నటుడు దీప్‌ సిద్ధూ మరణంతో ఒక్కసారిగా మారిపోయింది. దీప్‌ సిద్దూను ఏనాడు ప్రత్యక్షంగా కలవనప్పటికీ అతని ప్రభావం అమృత్‌పాల్‌పై బలంగా ఉందంటారు. 2022లో సిద్ధూ మరణం తరువాత ఆయన అనుచరులకు పాల్‌ గైడ్‌ చేస్తూ తనకు తానే వారిస్‌ పంజాబ్‌ దేకు లీడర్‌గా ప్రకటించుకున్నాడు. దీంతో తక్కువ కాలంలోనే అమృత్‌ పాపులర్‌గా మారాడు.

Tags

Read MoreRead Less
Next Story