Abhinandan Varthaman: ధైర్యసాహసాలకు ఇదే మా 'అభినందనం'..

Abhinandan Varthaman: శత్రుదేశానికి పట్టుబడినా, ఏమాత్రం బెదరకుండా ధైర్యసాహసాలు ప్రదర్శించిన గ్రూప్ కమాండర్ అభినందన్ వర్ధమాన్కు అత్యున్నత సైనిక పురస్కారం వీర్ చక్ర అవార్డు లభించింది. రాష్ట్రపతి భవన్ లో జరిగిన కార్యక్రమంలో వీర్ చక్ర, శౌర్య పురస్కారాల ప్రధానోత్సవం కన్నుల పండువగా జరిగింది. అభినందన్ కు వీర్ చక్ర అవార్డును రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అందజేశారు.
2019 ఫిబ్రవరిలో పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్ పై టెర్రరిస్టులు ఆత్మాహుతి దాడులు జరిపి 40 మంది భారత సైనికులను పొట్టన పెట్టుకున్నారు. ప్రతిగా పాకిస్థాన్ బాలాకోట్ లోని టెర్రరిస్టు స్థావరాలపై భారత్ వైమానిక దాడులు నిర్వహించింది. ఆ తర్వాతి రోజు పాకిస్థాన్ కు చెందిన యుద్ధవిమానం భారత్ భూబాగంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించగా.. మిగ్ 21తో వింగ్ కమాండర్ అభినందన్ దానిని కూల్చివేశారు.
ఈ క్రమంలో అభినందన్ నడిపిస్తున్న మిగ్-21 పాకిస్థాన్ భూభాగంలో కూలి శత్రుదేశాల సైనికులకు చిక్కారు. అయినా మొక్కవోని ధైర్యసాహసాలు చూపారు అభినందన్. అంతర్జాతీయ ఒత్తిళ్లతో అభినందన్ ను మూడు రోజుల తర్వాత పాకిస్థాన్ విడుదల చేసింది.
జమ్మూకాశ్మీర్లో జరిగిన ఓ ఆపరేషన్లో పలువురు ఉగ్రవాదులను అంతమొందించి.. కార్ప్స్ ఆఫ్ ఇంజినీర్స్కు చెందిన సాపర్ ప్రకాశ్ జాదవ్కు కీర్తి చక్ర ప్రదానం చేశారు. రాష్ట్రపతి చేతుల మీదుగా ఆయన సతీమణి, తల్లి ఈ అవార్డును అందుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com