సీనియర్ సిటిజన్స్కు 'ఎయిర్ ఇండియా' బంపరాఫర్
ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా సీనియర్ సిటిజన్లకు బంపర్ ఆఫర్ అమలు చేస్తోంది. 60 ఏళ్లు పైబడిన వృద్ధులకు టికెట్ ధరలో 50 శాతం డిస్కౌంట్ను అందిస్తోంది. అయితే ఇది ఎకానమీ క్లాస్కు మాత్రమే వర్తిస్తుందని సంస్థ యాజమాన్యం తెలిపింది. బేస్ ధరలో 50 శాతం చెల్లించడం ద్వారా టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఈ పథకాన్ని పొందగోరే వ్యక్తులు వయసును నిర్ధారించే ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్ లేదా ఏ ఇతర ఐడెంటిటీ కార్డ్ను కలిగి ఉండాలి.
దేశంలో ఏ ప్రాంతానికైనా ఈ డిస్కౌంట్ వెళ్లే సౌకర్యాన్ని సంస్థ కల్పిస్తోందని ఎయిర్ ఇండియా వర్గాలు తెలియజేశాయి. ప్రయాణ సమయం వారం రోజుల ముందు వరకు ఆ ఆఫర్ని వినియోగించుకునే వీలుందని వెల్లడించాయి. పెద్దవారితో పాటు రెండేళ్లలోపు ఉన్న చిన్నారులకు సైతం టికెట్ ధరలో తగ్గింపు అమలు చేయనున్నామని ఎయిర్ ఇండియా వర్గాలు వెల్లడించాయి. అయితే చిన్నారులకు ఇచ్చే ఈ ఆఫర్ ఒక బిడ్డకు మాత్రమే వర్తిస్తుందన్నారు.
అది కూడా రూ.1250 కూపన్, పన్నులు వర్తిస్తాయని తెలియజేశాయి. ఎయిర్ ఇండియా నిర్వాహక విమానాలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని పేర్కొన్నాయి. పూర్తి వివరాలకు ఎయిర్ ఇండియా వెబ్సైట్ని సందర్శించవచ్చు. కాగా బేస్ ధరకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని, ఫ్యూయల్ సర్చార్జి, సర్వీస్ ఫీజు తదితరాలలో తగ్గింపు లభించకపోవచ్చని విమానయాన రంగ నిపుణులు చెబుతున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com