Banke Birhari: నెత్తురోడిన లేఖ.. కారిడార్ పై రచ్చ
ఉత్తర్ ప్రదేశ్ : బృందావన్ ఆలయ కారిడార్ కు వ్యతిరేకంగా స్థానికులు ధర్నా చేస్తున్నారు. కారిడార్ ను ఏర్పాటు చేస్తే ఇళ్లు, వ్యాపారాలు దెబ్బతింటాయని మొరపెట్టుకుంటున్నారు. ఇందుకు నిరసనగా స్థానికులు రక్తంతో రాసిన 108 లేఖలను పీఎం మోదీకి, సీఎం యోగీకి పంపారు.
బృందావన్ లోని బాంకే బీహారీ ఆలయం చుట్టూ కారిడార్ నిర్మించేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆలయ పూజారులు, స్థానికులు, వ్యాపారులు కారిడార్ డిజైన్ కాపీలను దహనం చేశారు. నిరసనకారులు చేపట్టిన ధర్నాతో ఆలయ సమీపంలో మార్కెట్లు మూసివేశారు. బాంకే బీహారీ వ్యాపార సంఘం అధ్యక్షుడు అమిత్ గౌతమ్ మాట్లాడుతూ బృందావన్ వారసత్వాన్ని కాపాడాలని కోరుతూ ప్రధానికి, ముఖ్యమంత్రికి రక్తంతో రాసిన లేఖలను పంపామని తెలిపారు. మరోవైపు దీనిపై అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించామని అన్నారు.
85 ఏళ్ల నిరసనకారుడు శకుంతలా దేవి గోస్వామి మాట్లాడుతూ "కారిడార్ నిర్మాణం బృందావన్ వారసత్వాన్ని నాశనం చేయడమే కాకుండా మేము నిరాశ్రయులం అవుతామని అన్నారు. కారిడార్ కు వ్యతిరేకంగా జనవరి 12 నుంచి నిరసనలు ప్రారంభమైనట్లు తెలిపారు. జనవరి 23న కోర్టులో విచారణ జరుగనుందని చెప్పారు.
ఇద్దరు భక్తుల మృతి...
గత ఏడాది జన్మాష్టమి వేడుకల సందర్భంగా ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు భక్తులు మృతిచెందగా ఆరుగురు గాయపడ్డారు. ఘటనపై విచారణ జరిపి నివారణ చర్యలను సూచించాలని సీఎం యోగీ ఆదిత్యనాథ్, కమిటీని ఏర్పాటు చేశారు. ఆలయ పరిసరాలు ఇరుకుగా ఉన్నందున భక్తులు ఇబ్బందులకు గురవుతున్నారని కమిటీ తెలిపింది. దీంతో కారిడార్ ను ఏర్పాటు చేసేందుకు యూపీ ప్రభుత్వం నిర్ణయించింది. జనవరి 3న కారిడార్ నిర్మాణానికి సర్వే ప్రారంభించింది. అంతలోనే స్థానికుల నుంచి కారిడార్ కు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. డిసెంబర్ 20, 2020న బాంకే బీహారీ ఆలయానికి సంబంధించిన రిట్ ఫిటీషన్ లో అంచనా వ్యయాలతో కూడిన అభివృద్ధి ప్రణాళికలను కమిటీ సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com