ముక్కు ద్వారా కరోనా వ్యాక్సిన్.. కేంద్రం గ్రీన్ సిగ్నల్!

భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన ముక్కు ద్వారా వేసే కరోనా టీకా.. రెండో, మూడో దశ క్లినికల్ పరీక్షలకు కేంద్రం అనుమతించింది. ఇప్పటికే దేశంలోని నాలుగు ప్రధాన నగరాల్లో మొదటి దశ క్లినికల్ పరీక్షలను భారత్ బయోటెక్ నిర్వహించింది. ముక్కు ద్వారా వేసే వ్యాక్సిన్ మరో దశ క్లినికల్ ట్రయల్స్కు కేంద్రం పచ్చజెండా ఊపింది. రెండు, మూడో దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహణకు అనుమతించినట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ బయో టెక్నాలజీ శుక్రవారం వెల్లడించింది. ఇప్పటికే 18 నుంచి 60 ఏళ్ల వయసుల వారిపై నిర్వహించిన తొలి దశ క్లినికల్ ట్రయల్స్ పూర్తయ్యినట్లు తెలిపింది.
కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఇప్పటికే 'కొవాగ్జిన్' టీకాను తయారు చేసిన భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్.. ముక్కు ద్వారా ఇచ్చే టీకా ఆవిష్కరణపై దృష్టి సారించింది. దేశంలోని నాలుగు ప్రధాన నగరాల్లో మొదటి దశ క్లినికల్ పరీక్షలు నిర్వహించింది. దీని కోసం గతేడాది సెప్టెంబరులో భారత్ బయోటెక్, యూఎస్లోని వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ ఇన్ సెయింట్ లూయీస్తో ఒప్పందం కుదుర్చుకుంది. ముక్కు ద్వారా ఇచ్చే వ్యాక్సిన్ కరోనాపై సమర్థంగా పనిచేస్తున్నట్లు ఇప్పటికే జంతువులపై జరిపిన పరిశోధనలో వెల్లడైంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com