Bharath Jodo Yatra: ముగిసిన యాత్ర... నెక్స్ట్ ఏంటి?

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తలపెట్టిన భారత్ జోడో యాత్ర కన్యాకుమారి నుంచి మొదలై 4వేల కి.మి. మేర సాగి చివరకి కాశ్మీర్ లో ముగిసింది. శ్రీనగర్ లోని లాల్ చౌక్ వద్ద జెండా వందనం చేసి లాంఛనంగా యాత్రను ముగించారు. నేడు మంచు వర్షం సాక్షిగా యాత్ర చివరి ప్రసంగం చేసిన రాహుల్ ఇప్పుడు ఏం చేయబోతున్నారు. ప్రజలతో పాటు రాజకీయ నేతలు, ప్రత్యర్థులు అందరి మెదళ్లలోనూ మెదులుతున్న ప్రశ్న ఒక్కటే నెక్స్ట్ ఏంటి?
దేశాన్ని ఒక్కతాటి పైకి తీసుకువచ్చే ఉద్దేశంలో రాహుల్ ఈ భారత్ జోడో యాత్రకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ యాత్ర ద్వారా రాహుల్ అనుకున్నది సాధించారా? అంటే ప్రశ్నార్థకమే! 5నెలల యాత్రలో దశాబ్దాల సమస్యలకు, ముఖ్యంగా ఆర్ధిక అసమానతలకు ఫుల్ స్టాప్ పెట్టి, మత సామరస్యాన్ని పెంపొందించడం అనేది అసాధ్యం. వీటి కోసం ఏళ్లుగా పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. ఇకపైనా జరుగుతూనే ఉంటాయి. కానీ, వీటికి సరైన పరిష్కారం మాత్రం ఎప్పటికీ ఓ అంతుచిక్కని ప్రశ్నే... కేరళ, తమిళనాడు, తెలంగాణా, మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్, ఢిల్లీ, పంజాబ్ మీదుగా సాగిన ఈ యాత్ర ప్రధాన ఎజెండా నెరవేరిందా లేదా అన్నది ఫిబ్రవరిలో మొదలవ్వనున్న 9 రాష్ట్రాల ఎన్నికలే నిర్ణయిస్తాయి. అయితే ఈ ఎన్నికల్లో భాజాపాకు గట్టి పోటీ ఇవ్వాలన్నదే కాంగ్రెస్ ప్రధాన ఉద్దేశంగా కనబడుతోంది అనడంలో సందేహమేలేదు.
ఎందుకంటే ప్రత్యర్థి పార్టీలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే పరిస్థితి కనిపించడం లేదు. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కు లోక్ సభ ఎంపీలే లేరు. కానీ, భాజాపాకు వ్యతిరేకంగా పోరాడుతూ రాష్ట్ర స్థాయిల్లో కాస్తో కూస్తో ప్రభావం చూపే పార్టీగా గుర్తింపు పొందింది. ప్రధాని మోదికి ప్రత్యామ్నాయంగా తనని తాను కెజ్రీవాల్ ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు. కానీ, ఆమ్ ఆద్మీ పార్టీకి, కాంగ్రెస్ కు సత్సంబంధాలు లేవు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీతోనూ కాంగ్రెస్ కు సయోధ్యలేదు. ఈమెను కూడా ప్రధాని పదవికి పోటీదారుగానే భావిస్తున్నారు.
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఒకానొక సమయంలో అత్యుత్తమ పదవిపై మనసుపడ్డవారే. అయితే బీహార్ యాత్రలో నితీశ్ మాటవరసకు అయినా అందులో పాలుపంచుకోలేదు. తెలంగాణాలోనూ ఇదే పరిస్థితి. ఇక కాంగ్రెస్ తో సత్సంబంధాలు ఉన్నప్పటికీ ఆర్జేడీ కూడా రాహుల్ యాత్రకు మద్దతు తెలపలేదు.
ఇక సోమవారం శ్రీనగర్ లో జరిగిన ర్యాలీకి 24మంది నేతలను ఆహ్వానించినప్పటికీ చాలామంది తాము రాలేమని ముఖం మీదే చెప్పేశారని వినికిడి. మాజీ ప్రధాని దేవేగౌడ, నితీశ్ నిర్మొహమాటంగా రాలేమని చెప్పేశారు. ఆర్జేడీ, ఎన్సీపీ సైతం ఇదే పాటపాడేశారు. ఇక భాజాపాకు బలమైన ప్రత్యామ్నాయాలుగా తృణమూల్ కాంగ్రెస్, భారత రాష్ట్ర సమితి తమ వంతు ప్రయత్నాల్లో తలమునకలై ఉన్న సంగతి తెలిసిందే. అందుకే వారికి కనీసం ఆహ్వానం కూడా వెళ్లలేదట. ఒడిషా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సైతం ఎలాంటి ఆహ్వానం అందలేదని తెలుస్తోంది. బీజేడీ, వైఎస్ఆర్సీపీ తటస్థంగా ఉన్నప్పటికీ భాజాపాను కాదని ఏమీ చేయలేని పరిస్థితి వారిది.
తమిళనాడు డీఎంకే, రెండు కశ్మీరీ పార్టీలు ఎన్సీ, పీడీపీ, ఝార్ఖండ్ జేఎంఎం, సీపీఐ... మాత్రమే శ్రీనగర్ సభకు హాజరయ్యారు. మరి ఇంత మంది సహాయనిరాకరణ చేస్తే కాంగ్రెస్ ఏ ధైర్యంతో ముందడుకు వేస్తోందన్న అనుమానం రావచ్చు. దశాబ్దాలుగా ప్రజల్లో కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి పునర్మించుకునే ప్రయత్నమే రాహుల్ భారత్ జోడో యాత్ర ముఖ్య ఉద్దేశం. కానీ, ఇది మాత్రమే సరిపోదు అని పార్టీ పెద్దలకు కూడా తెలుసు. కేవలం భాజాపా చేపట్టిన కార్యక్రమాలను విమర్శిస్తే సరిపోదని వారికీ అనుభవ పూర్వకంగా అర్ధమైంది. అందుకే మరో వ్యూహాత్మక ప్రణాళికతో బరిలోకి దిగేందుకు సమాయత్తం అవుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com