ఆ కేసు విషయంలో మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు!

మద్రాస్ హైకోర్టు గురువారం సంచలన తీర్పును వెల్లడించింది. ఓ ఆడ, మగ ఇద్దరు తాళం వేసిన ఇంట్లో ఉంటే వారి మధ్య అక్రమసంబంధం ఉన్నట్టుగా భావించలేమని స్పష్టం చేసింది. ఓ సాయుధ రిజర్వ్ పోలీసు కానిస్టేబుల్ కేసు విచారణలో భాగంగా కోర్టు ఈ తీర్పును వెల్లడించింది. 1998లో సాయుధ రిజర్వ్ పోలీసు కానిస్టేబుల్ కే శరవణ బాబు తన క్వార్టర్లో మరో మహిళా కానిస్టేబుల్తో కలిసి ఉండడాన్ని చూసిన అధికారులు వారి మధ్య అక్రమ సంబంధం ఉందని తప్పుబట్టారు. దీనితో అతడిని విధుల నుంచి తొలగించారు. ఈ క్రమంలో శరవణ బాబు కోర్టును ఆశ్రయించాడు.
కేసు విచారణ సందర్భంగా.. " సమాజంలోని ఊహాతీత కథనాలను ఆధారంగా చేసుకుని క్రమశిక్షణా చర్యలు విధించడం, విధుల నుంచి తొలగించడం అనేది సరైనది కాదు. ఈ కేసులో శరవణ బాబు తన నివాసంలో ఓ మహిళా కానిస్టేబుల్తో ఉన్నాడు. అంత మాత్రాన వారి మధ్య అక్రమ సంబంధం ఉన్నట్లు భావించలేం'' అని వెల్లడించింది. అంతేకాక ఈ కేసులో ఇద్దరు కానిస్టేబుల్స్ని అభ్యంతరకర స్థితిలో చూసినట్లు ఒక్క ప్రతక్ష్య సాక్షి గాని, ఆధారాలు గాని లేవని స్పష్టం చేసింది.
ఈ సందర్భంగా శరవణ బాబు మాట్లాడుతూ.. సదరు మహిళా కానిస్టేబుల్ నివాసం.. నా క్వార్టర్స్ దగ్గర దగ్గరగా ఉంటాయి. ఒకరోజు ఆమె ఇంటి తాళం కోసం నా నివాసానికి వచ్చింది. అప్పుడు మేమిద్దరం మాట్లాడుకుంటున్నాం.. ఈ క్రమంలో ఎవరో తలుపు లాక్ చేశారు. దీనితో మేము ఎదో అనైతిక చర్యలకు పాల్పడుతున్నట్లు ఇరుగుపొరుగు వారు వచ్చి తలుపు తట్టారు" అని తెలిపాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com