Bipin Rawat funeral : ఇవాళ ఢిల్లీకి బిపిన్ రావత్ భౌతికకాయం .. రేపు అంత్యక్రియలు..!
తమిళనాడులోని నీలగిరి కొండల్లో జరిగిన హెలికాప్టర్ ఘోర ప్రమాదంలో దుర్మరణం చెందిన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ భౌతికకాయాన్ని ఇవాళ ఢిల్లీకి తరలించనున్నారు. ప్రస్తుతం రావత్ దంపతులు సహా జవాన్ల పార్థివదేహాలు వెల్లింగ్టన్లోని బేస్క్యాంపులో ఉంచారు. సాయంత్రం బిపిన్ రావత్ దంపతుల పార్థివ దేహాన్ని..సైనిక విమానంలో ఢిల్లీకి తరలించనున్నారు. రేపు ఆయన నివాసంలో భౌతికకాయాన్ని ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సందర్శనార్థం ఉంచనున్నారు. అనంతరం బ్రార్ స్క్వైర్ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
కోయంబత్తూర్, కూనూరు మధ్య జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో..బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులిక రావత్ సహా... 13 మంది ఆర్మీ ఉన్నతాధికారులు ప్రాణాలుకోల్పోయారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో సూలూరు ఎయిర్బేస్ నుంచి వెల్లింగ్టన్ వెళ్తుండగా ప్రమాదవశాత్తూ ఎంఐ 17 వీ5 హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో హెలికాప్టర్లో ప్రయాణిస్తున్న 14 మందిలో రావత్ దంపతులు సహా పదమూడు మంది ప్రాణాలు కోల్పోయారు.ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ చికిత్స పొందుతున్నారు.
మొదట ప్రమాదం జరిగిన వెంటనే రెస్క్యూ టీంలు స్పాట్ కు చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. చెల్లాచెదురుగా పడిఉన్న డెడ్ బాడీలను వెల్లింగ్టన్ హాస్పిటల్ కు తరలించారు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న బిపిన్ రావత్.... శరీరం పూర్తిగా కాలిపోవడంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ప్రమాదం జరిగిన ప్రాంతం వెల్లింగ్టన్ ఆర్మీ క్యాంప్కు కేవలం 16 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. మరో ఐదు నిమిషాల్లో ఆర్మీ క్యాంప్లో హెలికాప్టర్ ల్యాండ్ అవ్వాల్సి ఉండగా.. అంతలోనే ఈ దుర్ఘటన చోటుచేసుకోవడం పెను విషాదం నింపింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com