వలస కూలీల మరణాలపై మా వద్ద సమాచారం లేదు: కేంద్రం

కరోనా సమయంలో లాక్డౌన్ విధించడంతో చాలా మంది వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వందల మంది ప్రాణాలు కోల్పోయారు. దీనిపై పార్లమెంట్లో చర్చకు వచ్చింది. వలసకూలీలు ఎంత మంది ప్రాణాలు కోల్పోయారో లెక్క చెప్పాలని విపక్ష నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోశ్ గాంగ్వర్.. తమ దగ్గర అలాంటి లెక్కలు ఏమీ లేవని ప్రకటించారు. ఎంత మంది మరణించారన్న లెక్క తమ వద్ద లేకపోవడంతో నష్ట పరిహారం ప్రశ్నే ఉత్పన్నం కాదని కార్మిక శాఖ తెలిపింది.
లాక్డౌన్ సమయంలో తమిళనాడుకు చెందిన వలస కూలీలను కరోనా కష్ట కాలంలో ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని తమిళ ఎంపీలు అన్నారు. దీని గురించి మాట్లాడిన మంత్రి.. భారత్ చాలా పెద్దదని.. కరోనా సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఎన్జీవోలు, మెడికల్ ఆఫీసర్లు, శానిటైజ్ వర్కర్లు మానవతా దృక్పథంతో చాలా చేశారని అన్నారు. తమిళనాడులో కూడా అనేక సేవలందించారని సంతోశ్ గాంగ్వర్ తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com