Char Dham Yatra : చార్ధామ్ యాత్రకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్..!

ప్రఖ్యాత చార్ధామ్ యాత్ర ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూస్తున్న యాత్రికలకు ఎట్టకేలకు తీపికబురు వినిపిచింది. కరోనా ఉద్ధృతితో ఇన్నాళ్లు చార్ధామ్ యాత్రపై విధించిన ఆంక్షలను ఉత్తరాఖండ్ హైకోర్టు ఎత్తివేసింది. యాత్రకు వచ్చే భక్తులు కొవిడ్ నిబంధనలను కచ్చితంగా పాటించేలా చూస్తూ యాత్ర నిర్వహించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు ధర్మాసనం. చార్ధామ్ యాత్రకు వచ్చే భక్తులు కొవిడ్ పరీక్షలో 'నెగెటివ్' రిపోర్టు, వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లు తీసుకురావడాన్ని తప్పనిసరి చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఆలయాలను దర్శించుకునేందుకు ప్రతిరోజూ పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించడం వంటి నిబంధనలను పాటించాలని ఆదేశలిచ్చింది ..హైకోర్టు సీజేఐతో కూడిన ధర్మాసనం.
చార్ధామ్ క్షేత్రాల్లో రోజుకు ఏ ఆలయానికి ఎంతమందిని అనుమతించాలో ఉత్తరాఖండ్ హైకోర్టు పేర్కొంది. ప్రతిరోజూ కేదార్నాథ్కు 800, బద్రీనాథ్కు 1,200, గంగోత్రికి 600, యమునోత్రికి 400 మందిని చొప్పున భక్తులను అనుమతించాలని ధర్మాసనం పరిమితి విధించింది. ఆలయాల పరిధుల్లో ఉన్న నీటి కొలనుల్లో ఎవరినీ స్నానాలకు అనుమతించవద్దని స్పష్టం చేసింది ధర్మాసనం. మరోవైపు చార్ధామ్ యాత్ర ఈనెల 18 నుంచి ప్రారంభమవుతుందని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి స్పష్టం చేశారు. ఈ యాత్రపై వచ్చే భక్తులు తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలు పాటించాలని ప్రభుత్వం వెల్లడించింది. మాస్క్లు, శానిటైజర్ వాడకం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి అని పేర్కొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com