సుప్రీంకోర్టులో అరుదైన దృశ్యం.. కాసేపు తెలుగులో విచారణ..!

సుప్రీంకోర్టులో ఇవాళ ఓ అరుదైన దృశ్యం కనిపించింది. వివాహానికి సంబంధించిన ఓ కేసు విచారణ కాసేపు తెలుగులో జరిగింది. సుప్రీంకోర్టులో ఆంగ్ల భాషలో వాదనలు వినిపించేందుకు ఇబ్బంది పడుతున్న ఓ మహిళ కోసం అరుదైన నిర్ణయం తీసుకున్నారు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ. కాసేపు కేసు విచారణను తెలుగులోనే చేపట్టారు. ఉదయం సుప్రీంకోర్టులో వివాహానికి సంబంధించిన ఓ కేసు విచారణకు వచ్చింది. ఐతే.. కక్షిదారు అయిన ఓ మహిళ తన వాదనలు వినిపించాల్సి ఉంది. ఆంగ్లంలో మాట్లాడేందుకు ఆమె ఇబ్బంది పడుతున్నారని అర్థం చేసుకున్న జస్టిస్ రమణ.. వాదనల్ని తెలుగులోని వినిపించాలని సూచించారు. ఆమె చెప్పిన విషయాన్ని ఆంగ్లంలోకి అనువదించి, తన సహచర న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్కు వివరించారు జస్టిస్ రమణ. జస్టిస్ ఎన్.వి.రమణకు మాతృభాషపై మమకారం ఎక్కువ. తెలుగువాడిగా పుట్టినందుకు గర్వించాలని అనేక సందర్భాల్లో ఆయన అన్నారు. ప్రాథమిక విద్యాభ్యాసం మాతృభాషలోనే జరగాలని, న్యాయస్థానాల్లో తెలుగును ప్రోత్సహించాలని జస్టిస్ రమణ బలంగా కోరుకుంటారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com