15 రోజుల పాటు కర్ఫ్యూ.. కరోనా కట్టడికి ప్రభుత్వం కఠిన చర్యలు

మహారాష్ట్రలో కరోనా కరాళ నృత్యం చేస్తుంది. రోజూ సగటున 50 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఇవాళ్టి నుంచి మే 1 వరకు 15 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా కర్ఫ్యూ విధిస్తున్నట్టు ప్రకటించింది.
వైరస్ వ్యాప్తి నేపథ్యంలో నలుగురు కంటే ఎక్కువమంది గుమిగూడకుండా 144 సెక్షన్ విధించారు. అత్యవసర సేవలు మాత్రమే అనుమతి ఇచ్చారు. ఆస్పత్రులు, బ్యాంకులు, ఈ-కామర్స్, పెట్రోల్ బంకులకు మినహాయింపునిచ్చారు. అవసరమైతేనే ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావాలని.. అనవసరమైన ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని అధికారులు సూచించారు.
ఆంక్షలు కఠినంగా అమలు చేస్తామని, అయితే ఇది లాక్డౌన్ మాత్రం కాదని స్పష్టతనిచ్చారు సీఎం ఉద్ధవ్. కరోనాపై మరోసారి పోరు మొదలైందన్నారు. ఆంక్షలు అమల్లో ఉన్న నేపథ్యంలో వచ్చే నెలలో రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి మూడు కిలోల గోధుమలు, రెండు కిలోల బియ్యాన్ని ఉచితంగా సరఫరా చేయనున్నట్టు తెలిపారు.
జనతా కర్ఫ్యూలో భాగంగా రాష్ట్రమంతటా 144 సెక్షన్ అమలవుతుంది. దుకాణాలను, బహిరంగ ప్రదేశాలను మూసివేస్తారు. ఇళ్లలో పనిచేసేవారు, డ్రైవర్లు, సహాయకులు యథావిధిగా పనులు చేసుకోవచ్చా? లేదా? అన్నది స్థానిక పరిస్థితులకు అనుగుణంగా అధికారులు నిర్ణయిస్తారు.
ఆసుపత్రులు, వ్యాధి నిర్ధారణ కేంద్రాలు, మెడికల్ షాపులు, వ్యాక్సినేషన్ కేంద్రాలు సహా.. కూరగాయలు, కిరాణా దుకాణాలు, హోటళ్లకు మినహాయింపు ఇచ్చారు. ప్రజా రవాణాకు ఇబ్బంది ఉండదు. విమానాలు, రైళ్లు, ఆటోలు, బస్సులు తిరుగుతాయి. సెబీ, ఆర్బీఐ, ఈ-కామర్స్, రవాణా-కార్గో తదితర సేవలు కొనసాగుతాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com