కోవిడ్ బాధితులతో నిండిపోతున్న ఆసుపత్రులు.. వైద్యం అందక ఆసుపత్రి బయటే పేషెంట్ మృతి

గుట్టలుగా కరోనా మృత దేహాలు. శవాలను మోసుకొచ్చి.. వంతుకోసం వరుసగా నిలుచున్న అంబులెన్స్లు. కన్నీటిని దిగమింగుతూ అంత్యక్రియల కోసం వేచి చూస్తున్న బంధువులు. ఖాళీగా లేని శ్మశాన వాటికలు. ఇవీ కరోనా విజృంభిస్తున్న వేళ.. మధ్యప్రదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు. 1984 నాటి దుర్ఘటనను తలపిస్తోంది. నాడు భోపాల్ విష వాయువు దుర్ఘటన తర్వాత మరోసారి అలాంటి దుర్భర పరిస్థితులు ఇప్పుడు నెలకొన్నాయని స్థానికులు చెబుతున్నారు. మరణాల విషయంలో వాస్తవ పరిస్థితులకు, అధికార గణంకాలకు మధ్య తేడా ఉందంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
అటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఢిల్లీ, గుజరాత్, బీహార్లో ఇంతకుముందెన్నడు కనించని పరిస్ధితులు నెలకొన్నాయి. ఆరు రాష్ట్రాల్లోని ఆసుపత్రులు.. కరోనా బాధితులతో నిండిపోతున్నాయి. ఖాళీ లేక పేషెంట్స్ను చేర్చుకునేందుకు బెడ్స్ కూడా దొరకడం లేదు. దీంతో కోవిడ్ బాధితులు ఆసుపత్రుల బయటే పడిగాపులు కాస్తున్నారు. మరికొందరు ఆసుపత్రి పరిసరాల్లో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు.
జార్ఖండ్లో వైద్యం అందక ఆసుపత్రి బయటే పేషెంట్ మృతి చెందిన ఘటన అక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది. కోవిడ్ పేషెంట్స్ను తీసుకుని రాంచిలోని ఆసుపత్రికి వచ్చింది మహిళ. అయితే బెడ్స్ ఖాళీ లేదని చెప్పడంతో ఆసుపత్రి బయటే పేషెంట్తో ఆమె పడిగాపులు కాసింది. అయితే ఎంత వేచి ఉన్నా బెడ్స్ దొరకకపోవడంతో కోవిడ్ పేషెంట్ ఆసుపత్రి బయటే మృతి చెందాడు. దీంతో కన్నీరు మున్నీరుగా విలపించింది బాధిత మహిళ. ప్రభుత్వంపై, అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోదించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com