జియో కస్టమర్ కేర్ అని ఎవరైనా కాల్ చేస్తున్నారా.. జాగ్రత్త

టెక్నాలజీ పెరిగింది.. చోరుల పంథా మారింది. ఉన్న చోటు నుంచే ఊడ్చేయొచ్చు. ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ అకౌంట్లో డబ్బులు ఎలా స్వాహా చేయాలా అని ఆలోచిస్తుంటారు సైబర్ నేరగాళ్లు. తాజాగా జియో కస్టమర్లను టార్గెట్ చేస్తూ సరి కొత్త మోసాలకు తెరతీస్తున్నారు. జియో నెట్వర్క్ వినియోగదారులకు మీ బ్యాలెన్స్ పూర్తయింది రీచార్జ్ చేసుకోండి అని మెసేజ్ వస్తుంటుంది. దీన్నే అస్త్రంగా మలుచుకున్న సైబర్ నేరగాళ్లు '' మీరు రీచార్జ్ చేసుకోకపోతే మీ సిమ్ బ్లాకవుతుంది.
వెంటనే రీచార్జ్ చేసుకోండి అని మెసేజ్లు పంపుతున్నారు. రీచార్జ్ చేసేందుకు వారిని సంప్రదిస్తే బాధితులతో రిమోట్ యాక్సెస్ యాప్ను ఇన్స్టాల్ చేయించి మాటలతో మభ్యపెట్టి ఖాతా ఖాళీ చేస్తున్నారు. నగరానికి చెందిన ఇద్దరు మహిళలు వారు చెప్పిన విధంగా చేసి రూ.2.70 లక్షలు పోగొట్టుకున్నారు. మోసపోయామని తెలుసుకున్న బాధితులు వెంటనే సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
మరికొందరు వ్యక్తులు కూడా ఈ విధంగానే సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన కేసులు పోలీసుల దృష్టికి వచ్చినట్లు క్రైం పోలీసులు వివరించారు. ఓ ఎల్ఐసీ ఏజెంట్తో మాటలు కలిపి కస్టమర్లను ఇప్పిస్తామని మభ్యపెట్టి అతడి నుంచి రూ.86వేలు కాజేశారు. అదే విధంగా డబ్బులు పంపుతాము, క్యూఆర్కోడ్ స్కాన్ చేయమంటూ మరో ఆరుగురు వ్యక్తుల నుంచి రూ.4.50 లక్షలను తమ ఖాతాలోకి మళ్లించుకున్నారు. మరో మహిళ తన అకౌంట్లో నుంచి రూ.6 లక్షలు ఏవిధంగా మాయం అయ్యాయో అర్థం కావట్లేదని సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించింది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com