Delhi Air Pollution: దేశ రాజధానిలో కొత్త సమస్య.. లాక్డౌన్ అమలు చేసే ప్లాన్లో ప్రభుత్వం..

Delhi Air Pollution (tv5news.in)
Delhi Air Pollution: ఎయిర్ క్వాలిటీ మెరుగుపరిచేందుకు ఢిల్లీ సర్కార్ తీసుకున్న పలు నిర్ణయాలు ఇవాల్టి నుంచి అమల్లోకి వచ్చాయి. విద్యాసంస్థలు అన్ని మూతపడ్డాయి. వారం రోజుల పాటు ఆన్లైన్లోనే పాఠాలు బోధించాలని సూచించింది ఢిల్లీ సర్కార్. పరీక్షలు రాసేవారికి మినహాయింపునిచ్చింది. ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఇవాల్టి నుంచి వారం పాటు ఇళ్ల నుంచి విధులు నిర్వహిస్తున్నారు.
వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇవ్వాలని ప్రైవేట్ రంగ సంస్థలకు పిలుపునిచ్చింది ఢిల్లీ సర్కార్.ఇక ఇవాల్టి నుంచి మూడు రోజుల పాటు ఢిల్లీలో నిర్మాణ రంగ పనులపై నిషేధం విధించింది ఢిల్లీ సర్కార్. శనివారంతో పోలిస్తే ఆదివారం ఎయిర్క్వాలిటీ కాస్త మెరుగైందన్నారు ఢిల్లీ ఎన్విరాన్మెంటల్ మినిస్టర్ గోపాల్ రాయ్. అయినప్పటికి వెరీ పూర్ కేటగిరీలోనే గాలి నాణ్యత ఉందన్నారు. మరింత పోల్యూషన్ను తగ్గించేందుకు లాక్డౌన్ ప్లాన్ను ఇవాళ సుప్రీంకోర్టుకు సమర్పిస్తామని చెప్పారు.
శనివారం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 437గా నమోదు కాగా..ఆదివారం అది 330కి తగ్గింది. ఇక ఈ సీజన్లోనే ఢిల్లీలో అత్యంత వాయుకాలుష్యం శుక్రవారం నమోదైంది. శుక్రవారం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 471గా చూపించింది. ఢిల్లీలో కాలుష్యంపై శనివారం ఆందోళన వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. ఇంట్లో కూడా మాస్కులు పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. గాలి నాణ్యత మెరుగుపరిచేందుకు లాక్ డౌన్ అంశాన్ని కూడా పరిశీలించాలని ఢిల్లీ సర్కార్కు సూచించారు.
మరోవైపు ఢిల్లీ పొరుగురాష్ట్రాలైన హర్యాణ, రాజస్థాన్, ఉత్తర్ప్రదేశ్ లోనూ గాలి నాణ్యత పడిపోయింది. కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ గాలికాలుష్యం తగ్గించేందుకు ఢిల్లీ తరహా చర్యలు తీసుకోవాలని ఆయా రాష్ట్రాలకు సూచించింది.
ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 0 నుంచి 50 మధ్య చూపిస్తే గుడ్ కేటగిరిలో ఉన్నట్లు చెప్తారు. 51 నుంచి 100 మద్య ఉంటే సంతృప్తకర స్థాయి, 101 నుంచి 200 మధ్య మధ్య స్థాయి, 201 నుంచి 300 మధ్య పూర్ కేటగిరిగా చెప్తారు. 301 నుంచి 400 మధ్య నమోదైతే దాన్ని వెరీ పూర్ కేటగిరీగా.. 401 ఆ పైన నమోదైతే దాన్ని సివియర్ గా పరిగణిస్తారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com