దేశ రాజధాని ఢిల్లీలో మరో వారం రోజుల పాటు లాక్డౌన్ పొడిగింపు..

కరోనా ఉధృతి నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో లాక్ డౌన్ మరో వారం రోజులు పాటు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో కరోనా తీవ్రంగా ఉందని.. మహమ్మారి మరింత వ్యాపించకుండా ఉండేందుకు మే 3 వరకు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. మే 3వ తేదీ ఉదయం 5 గంటల వరకు లాక్ డౌన్ అమల్లో ఉంటుందన్నారు. పరిస్థితులు అర్థం చేసుకుని ప్రజలు సహకరించాలని కోరారు.
ఢిల్లీలో కరోనా విజృంభిస్తుండడంతో ఈనెల 19వ తేదీ రాత్రి 10 గంటల నుంచి 26వ తేదీ ఉదయం 5 గంటల వరకు పూర్తి స్థాయి లాక్ డౌన్ విధించారు. ప్రస్తుతం లాక్ డౌన్ విధించకపోతే పరిస్థితులు చేయిదాటిపోయే ప్రమాదం ఉందని కేజ్రీవాల్ వెల్లడించారు. మరోవైపు కరోనా ఆసుపత్రుల్లో పరిస్థితులు ఘోరంగా ఉన్నాయి. ఆక్సిజన్ కొరత ఏర్పడి పదుల సంఖ్యలో రోగులు మృతిచెందుతున్నారు.
జైపూర్ గోల్డెన్ ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక 20మంది.. సర్ గంగారామ్ ఆసుపత్రిలో 25 మంది మరణించారు. గడిచిన 24 గంటల్లో ఢిల్లీలో 24వేలకు పైగా కేసులు నమోదుకాగా.. అత్యధికంగా 357 మంది మృత్యువాత పడ్డారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com