BRS Flexi in Delhi : ఢిల్లీ వీధుల్లో బీఆర్ఎస్ ఫ్లెక్సీలు.. పీకి పడేస్తున్న మున్సిపల్ సిబ్బంది

BRS Flexi in Delhi : ఢిల్లీ వీధుల్లో బీఆర్ఎస్ ఫ్లెక్సీలు.. పీకి పడేస్తున్న మున్సిపల్ సిబ్బంది
ఢిల్లీ వీధుల్లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగించారు.

BRS Flexi: ఢిల్లీ వీధుల్లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగించారు. సర్దార్‌ పటేల్‌ మార్గ్‌లోని బీఆర్ఎస్‌ పార్టీ ఆఫీసు ఎదుట కేసీఆర్ ఫర్ ఇండియా, దేశ్‌ కీ నేత, కిసాన్‌ కి భరోసా, అబ్‌ కీ బార్‌ కిసాన్ సర్కార్ అనే నినాదాలతో హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఐతే అనుమతి లేకుండా ఏర్పాటు చేశారంటూ ఫ్లెక్సీలను తొలగించారు.


మరోవైపు ఢిల్లీ బీఆర్ఎస్‌ భవన్‌లో కాసేపట్లో రాజశామల యాగం ప్రారంభం కానుంది. గణపతి పూజతో రుత్వికులు యాగం ప్రారంభించనున్నారు. మొత్తం 12 మంది రుత్వికుల ఆధ్వర్యంలో ఈ పూజలు జరుగుతున్నాయి. సీఎం కేసీఆర్ సతీసమేతంగా ఈ పూజలో పాల్గొంటున్నారు.



శృంగేరి పీఠాధిపతి శృంగేరి పీఠం గోపీకృష్ణ, ఫణి శశాంక ఆధ్వర్యంలో యాగాలు జరుగుతున్నాయి. యాగశాలలో మూడు హోమగుండాలు ఏర్పాటు చేశారు. ఢిల్లీ సర్దార్‌ పటేల్‌ మార్గ్‌లోని బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో పూజలు జరుగుతున్నాయి.


సర్దార్‌ పటేల్‌ మార్గ్‌లోని అద్దె భవనంలో బీఆర్ఎస్ తాత్కాలిక ఆఫీసును..బుధవారం మధ్యాహ్నం 12 గంటల 36 నిమిషాలకు కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌, ఆర్జేడీ యువనేత తేజస్వి యాదవ్, రైతు నాయకుడు రాకేష్‌ టికాయత్‌ సహా పలు రైతు సంఘాల నేతలు హాజరుకానున్నారు.



వాస్తుకు అనుగుణంగా సుద్దాల సుధాకర్‌ తేజ సూచనల ప్రకారం ఆఫీసు బిల్డింగ్‌లో మార్పులు, చేర్పులు, మరమ్మతు పనులు చేపట్టారు. ఆఫీసు ప్రారంభోత్సవ కార్యక్రమానికి వివిధ రాష్ట్రాల నుంచి ప్రతినిధులు హాజరుకానున్నారు. తెలంగాణ నుంచి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు కార్పొరేషన్ల ఛైర్మన్లు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు ఇప్పటికే ఢిల్లీ బయల్దేరి వెళ్లారు.


ఇక సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన ఐదు రోజుల పాటు సాగనుంది. ఈ నెల 18న హైదరాబాద్‌కు తిరిగివస్తారని సమాచారం. ఇతర రాష్ట్రాల్లో కూడా బీఆర్ఎస్ ఆఫీసులు ఏర్పాటు చేయనున్నట్లు పార్టీ నాయకుల ద్వారా తెలిసింది.

Tags

Read MoreRead Less
Next Story