రూ.2 లక్షలకు పైగా.. ఆన్లైన్లో ఈజీగా..
నేటి నుంచి ఆర్టీజీఎస్ సేవలు 24 గంటలూ అందుబాటులో ఉంటాయి. దీంతో రూ.2 లక్షలు.. అంతకు మించి పెద్ద మొత్తాలను ఆన్లైన్ ద్వారా సులభంగా బదిలీ చేయొచ్చు. ఈ సర్వీసు అందుబాటులోకి రావడంతో భారీ సొమ్మును సైతం త్వరగా బదిలీ చేసేందుకు అవకాశం ఉన్నట్లు బ్యాంకింగ్ వర్గాలు పేర్కొన్నాయి. తద్వారా రోజంతా ఆర్టీజీఎస్ సేవలు అందుబాటులోగల ప్రపంచంలోని కొద్ది దేశాల సరసన భారత్ నిలిచినట్లు తెలియజేశాయి. నగదు బదిలీ సేవలకు సంబంధించిన ముఖ్య విషయాలు..
ఒక బ్యాంకు నుంచి మరో బ్యాంకుకి సొమ్ము రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ సిస్టమ్ (ఆర్టీజీఎస్) ద్వారా బదిలీ కానుంది. ఇందుకు బ్యాంకులు అదనంగా ఎలాంటి చార్జీలు విధించవు. ఈ సేవలను ఆన్లైన్తో పాటు, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా కూడా నిర్వహించుకోవచ్చు. బ్రాంచీని సందర్శించడం ద్వారా ఆన్లైన్లోనూ ఈ సర్వీసులను పొందవచ్చు. కనీసం రూ.2 లక్షల మొత్తాలను ఆర్టీజీఎస్ ద్వారా పంపించవచ్చు. ఈ విధానంలో గరిష్ట పరిమితిలేదని బ్యాంకింగ్ వర్గాలు తెలిపాయి.
చిన్న మొత్తంలో నగదును పంపించేందుకు వీలుగా నెప్ట్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది ఆర్బీఐ. ఈ బాటలోనే తాజాగా ఆర్టీజీఎస్ సేవలనూ పొడిగించింది. 4 ప్రధాన బ్యాంకుల ద్వారా 2004 మార్చి 26న ఆర్టీజీఎస్ సేవలు దేశీయంగా తొలిసారి అందుబాటులోకి వచ్చాయి. దేశీయంగా డిజిటల్ బ్యాంకింగ్ను ప్రమోట్ చేసే బాటలో ఆర్బీఐ నెప్ట్, ఆర్టీజీఎస్ సేవలపై అదనపు చార్జీలను విధించవద్దంటూ బ్యాంకులను ఆదేశించినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు.
Tags
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com