గచ్చిబౌలిలో యువ ఇంజనీర్ ఆత్మహత్య
చిన్న సమస్యల్ని కూడా పెద్దగా చూస్తున్నారు.. వాటిని అధిగమించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు నేటి యువత.. ఇంజనీర్ చదివి సాప్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న ఓ యువకుడు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. నగరంలోని గచ్చిబౌలిలో యువ ఇంజనీర్ ఆత్మహత్య చేసుకొని కుటుంబసభ్యులకు కన్నీరు మిగిల్చాడు. ఓ సంస్థలో సైట్ ఇంజనీర్గా పని చేస్తున్న వెంకట్ రావు (27) తన హాస్టల్ గదిలో ఉరివేసుకుని బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు.
నా జీవితంలో ఒక కఠిన నిర్ణయం తీసుకుంటున్నాను అని చనిపోయేముందు తన సోదరుడు దీపక్కు వాట్సాప్ మెసేజ్ పంపించి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. వెంకట్ రావు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
ఇదిలా ఉంటే సికింద్రాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మరో యువకుడు కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తిరుమలగిరిలో నివాసం ఉంటున్న సుధాకర్ కుమారుడు అజయ్ (18) ఇంటర్ పూర్తి చేశాడు. స్థానికంగా ఉన్న డిగ్రీ కళాశాల వెనక ఉన్న నిర్మానుష్య ప్రాంతంలో చెట్టుకు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com