రైతుల ట్రాక్టర్ ర్యాలీపై పోలీసులే నిర్ణయం తీసుకుంటారు:సుప్రీంకోర్టు

ఢిల్లీలో రైతులు చేపట్టదలచుకున్న ట్రాక్టర్ ర్యాలీపై పోలీసులే నిర్ణయం తీసుకుంటారని సుప్రీంకోర్టు తెలిపింది. కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపడుతున్న ట్రాక్టర్ ర్యాలీని సవాల్ చేస్తూ కేంద్రం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై విచారించిన సుప్రీంకోర్టు.. తుది నిర్ణయం పోలీసులే తీసుకోవాలని చెప్పింది.
సాగు చట్టాల రద్దుపై కేంద్రాన్ని ఇరకాటంలో పెట్టేందుకు జనవరి 26న.. ఢిల్లీ ఔటర్ రింగ్ రోడ్డుపై ట్రాక్టర్ పరేడ్ నిర్వహిస్తామంటున్నారు రైతులు. ఇప్పటికే రిహార్సల్స్ కూడా చేశారు. ప్రశాంతంగా ర్యాలీ చేస్తామని, రిపబ్లిక్ డే కార్యక్రమాలకు ఎలాంటి ఆటంకమూ కలగదని, రెచ్చగొట్టే ప్రసంగాలేవీ చెయ్యబోమని రైతులు ప్రకటించారు. ప్రతి ట్రాక్టర్ ముందు జాతీయ జెండాను పెడతామని కూడా రైతు సంఘం నేతలు తెలిపారు.
దేశ రాజధానిలో రిపబ్లిక్ డే పరేడ్ ముగిసిన వెంటనే ఢిల్లీ ఔటర్ రింగ్ రోడ్పై లక్ష ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారు. ఇప్పటికే పంజాబ్లోని పలు ప్రాంతాల నుంచి ట్రాక్టర్లతో రైతులు బయల్దేరారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com