కిలాడీలు.. లేడీస్ హ్యాండ్ బ్యాగ్లో బంగారు కడ్డీలు పెట్టి..
గన్నవరం ఎయిర్పోర్ట్లో భారీగా బంగారం పట్టుబడింది. కువైట్ నుంచి అక్రమంగా బంగారం తీసుకువచ్చిన ఇద్దరు ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. వారి నుంచి మొత్తం రూ.95 లక్షల 11 వేల 500ల రూపాయల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ గుణదలకు చెందిన ఇద్దరు ప్రయాణికులు కువైట్ నుంచి ఎయిర్ ఇండియా 1902 నంబర్ విమానంలో ఈనెల 17న విజయవాడ విమానాశ్రయానికి వచ్చారు. వారి వద్ద మూడు లేడీస్ హ్యాండ్ బ్యాగులు ఉన్నాయి.
కస్టమ్స్ అధికారులకు అనుమానం రావడంతో వాటిని తనిఖీ చేయగా, అందులో మెటల్ జార్, టూల్ కిట్, బెల్టులు, బకెల్స్ ఉన్నాయని తెలిపారు. పైకి స్టీల్ కోటింగ్తో ఉన్నప్పటికీ లోపల మాత్రం బంగారం పూత ఉందని.. ఈ మొత్తం వస్తువులపై పూతను తొలగించి చూడగా బంగారు రంగు బయటకు వచ్చిందని అధికారులు వెల్లడించారు. టూల్ కిట్ మధ్య బంగారం కడ్డీలను అమర్చి తీసుకొచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఎలాంటి పన్నులు చెల్లించకుండా మొత్తం 1.865 కిలోల బంగారాన్ని తీసుకొచ్చినట్లు అధికారులు నిర్ధారించారు. వారిని అదుపులోకి తీసుకున్న అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Tags
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com