అదిరింది బాసూ.. గూగుల్ మీట్లో పెళ్లి... జొమాటోలో డిన్నర్..!
దేశంలోకి కరోనా ఎంట్రీ ఇచ్చాక అన్ని మారిపోయాయి. కనీసం మనిషి మనిషి దగ్గరుండి ఓ పది నిముషాలు స్వేచ్చగా మాట్లాడుకోవడం కూడా కష్టంగా అయిపొయింది. ఇక పెళ్ళిళ్ళ సంగతి అయితే సరేసరి.. ఒకప్పుడు ఐదురోజుల పెళ్లి అంటే వినేవాళ్ళం కానీ కరోనా దెబ్బకి ఇప్పుడు అయిదుగురి సమక్షంలో చేసుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఆన్లైన్ పెళ్ళిళ్ళు అయితే మరీ ఎక్కువైపోయాయి. తాజాగా పశ్చిమ బెంగాల్కు చెందిన ఓ జంట ఆన్లైన్ వేదికగా 450 మంది అతిథులతో పెళ్లి వేడుకలకు సిద్ధమవుతోంది. అంతేకాకుండా పెళ్ళిని చూసే అతిథులకు 'జొమాటో'తో విందు కూడా ఇవ్వనుంది.
పశ్చిమ బెంగాల్లోని బుర్ద్వాన్ ప్రాంతానికి చెందిన సందీపన్ సర్కార్, అదితి దాస్ కి పెళ్లి ఫిక్స్ అయింది. ఏడాది కాలంగా వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు. కానీ కరోనా అంక్షల నేపధ్యంలో పలుమార్లు ఆ పెళ్లి వాయిదా పడుతూ వచ్చింది. ఫైనల్ గా ఈ ఏడాది జనవరి 24న వీరిద్దరి పెళ్లి ఫిక్స్ అయింది. కానీ ఈసారి ఒమిక్రాన్ ఎంట్రీ ఇచ్చింది. అంతేకాకుండా సందీపన్ కూడా కొవిడ్ బారినపడ్డారు. తాజాగా కరోనా నుంచి కోలుకున్నాడు. మరోవైపు వైరస్ ఉద్ధృతితో బెంగాల్ ప్రభుత్వం కరోనా ఆంక్షలు విధించింది. వివాహాది శుభకార్యాల్లో అతిథులపై పరిమితి విధించింది. దీనితో అందర్నీ పిలిచి పెళ్లి చేసుకోలేని పరిస్థితి.. అలా అని మళ్ళీ పెళ్లిని వాయిదా కూడా వేయలేం.
ఈ టైంలోనే ఆన్లైన్ వెడ్డింగ్ ఆలోచన వచ్చింది సందీపన్ కి.. దీనికోసం ఓ టెక్నికల్ పర్సన్ ని కూడా నియమించుకున్నాడు. పెళ్లి తేదీకి ఒక రోజు ముందు అతిథులందరికీ గూగుల్ మీట్లో ఓ లైవ్ లింక్, పాస్వర్డ్ను పంపించనున్నారు. ఆ లింక్ ఓపెన్ చేసి.. బంధువులు తమ ఇళ్లల్లోనే ఉండి సురక్షితంగా వివాహాన్ని చూసేలాఏర్పాటు చేశాడు. అంతేకాకుండా పెళ్లికి హాజరైన వాందరికీ విందు భోజనాలు కోసం జొమాటో యాప్ ద్వారా అతిథులందరికీ డిన్నర్ డెలివరీ చేసే ఏర్పాట్లు చేశాడు సందీపన్.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com