Harekala Hajabba: హ్యాట్సాప్ హాజబ్బ.. పండ్లమ్ముతూ పాఠశాల కట్టించి..

Harekala Hajabba: ఆశలు, ఆశయాలు ఉన్నతంగా ఉండాలంటే ఆస్తులు, అంతస్తులు అవసరంలేదు అని నిరూపించారు హజబ్బ. అతడి సేవలకు గాను అత్యున్నత పురస్కారం పద్మశ్రీ అందుకున్నారు. చేసేది చిన్న వ్యాపారం. అయినా మొక్కవోని ధైర్యం. తన ఆశయం కోసం అహోరాత్రులు శ్రమించి పాఠశాల కట్టించారు.. గ్రామంలోని పేద పిల్లలు చదువుకునేందుకు పాఠశాల కట్టించాడు.
మంగళూరుకు చెందిన నారింజ పండ్ల వ్యాపారి హరేకల హజబ్బ రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ అందుకున్నారు. దశాబ్ధ కాలంగా తన సంస్థ ద్వారా న్యూ పడపు గ్రామంలోని పేద పిల్లలకు విద్యనందించినందుకు ఈ అత్యున్నత పురస్కారం అతడిని వరించింది. హాజబ్బాకు అక్షరం ముక్క రాదు. మంగళూరులోని హంపన్కట్టా మార్కెట్లో పండ్లు విక్రయిస్తుంటాడు. పాఠశాల నిర్వహణ కోసం తన సంపాదన ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఖర్చుపెట్టాడు.
హజబ్బ మొదట్లో స్థానికులను ఒప్పించి మసీదు ప్రాంగణంలో పాఠశాలను కట్టించాడు. తాను కట్టించిన పాఠశాలలో ఆవరణను ఊడ్చడం, పిల్లలకు త్రాగడానికి నీరు మరిగించి, తన స్వగ్రామానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న దక్షిణ కన్నడలోని జిల్లా పంచాయతీ కార్యాలయానికి వెళ్లి తన పాఠశాలకు విద్యా సౌకర్యాలను అధికారికం చేయాలని పదేపదే అభ్యర్థనలు చేసేవాడు.
2008లో, హాజబ్బ కృషితో, న్యూపడుపు గ్రామంలో దక్షిణ కన్నడ జిల్లా పంచాయతీలో ఉన్నత ప్రాథమిక పాఠశాల ఏర్పాటు చేసింది కర్ణాటక ప్రభుత్వం. విద్యార్థులు మరియు అధ్యాపకులకు అవసరమైన అన్ని సౌకర్యాలు ఉండేలా చూస్తూనే, పాఠశాల నిధులను క్రమబద్ధీకరించడానికి అతడు కూడా ఒక సంస్థను ఏర్పాటు చేశాడు.
గత ఏడాది జనవరిలో హాజబ్బ తన గ్రామంలోని పిల్లల కోసం అదే ప్రాంగణంలో ప్రీ-యూనివర్శిటీ కళాశాలను ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు చెప్పాడు. నగరంలో ఉన్నత విద్యాసంస్థలు తక్కువగా ఉన్నందున విద్యార్ధులు 10వ తరగతి చదివిన తరువాత పై చదువులు చదవడం ఆపేస్తారు. అందుకే యూనివర్శిటీ కూడా ఏర్పాటు చేస్తే విద్యార్ధులు పై చదువులు చదవడానికి ఆస్కారం ఉంటుందని భావించాడు.
అక్షరజ్ఞానం లేని హాజబ్బ అందరికీ విద్యనందించాలనుకోవడం హర్షనీయం. ఇందుకు ఆయన చేసిన కృషి అభినందనీయం.. అందుకే అతడు పద్మశ్రీకి అర్హుడయ్యాడు అని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ట్విట్టర్లో పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com