Mumbai: ముంబైలో భారీ వర్షాలు.. విరిగిపడుతున్న కొండచరియలు..
Mumbai: ముంబైతో సహా మహారాష్ట్రలోని మరికొన్ని ఇతర ప్రాంతాలలో భారీ వర్షం కురుస్తోంది. దీంతో ముంబైకి 300 కి.మీ దూరంలో ఉన్న రత్నగిరి జిల్లాలోని సబర్బన్ ఘట్కోపర్, చిప్లూన్ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయని అధికారులు తెలిపారు.
సహాయక చర్యల కోసం అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయని, ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అగ్నిమాపక శాఖ తెలిపింది. భారీ వర్షం తర్వాత కొండచరియలు విరిగిపడటంతో సమీపంలో ఉన్న ఇళ్లు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది.
కొండచరియలు విరిగిపడటంతో బండరాళ్లు కొండపై నుండి రోడ్డుపైకి దొర్లుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అర్థరాత్రి కొండచరియలు విరిగిపడటంతో ముంబై-గోవా హైవేపై ట్రాఫిక్ నిలిపివేయాల్సి వచ్చింది.
మహారాష్ట్రలోని కొంకణ్ తీర ప్రాంతంలో రానున్న ఐదు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. గత ఏడాది భారీ వరదలు సంభవించిన ప్రాంతంలో ముందు జాగ్రత్త చర్యగా అధికారులు రెండు బృందాలను మోహరింపజేశారు. జూన్ 4 నుంచి జూన్ 8 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రాయ్గఢ్, రత్నగిరి, సింధుదుర్గ్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com