వేడినీటి స్నానంతో గుండె పనితీరు..
గోరు వెచ్చని నీటితో స్నానం చేస్తే గుండె ఆరోగ్యం పదిలం అంటున్నారు కార్డియాలజిస్ట్ లు. వేడి నీటి స్నానం గుండె పనితీరుని మెరుగు పరుస్తుందని హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని చెబుతున్నారు. హార్ట్ జర్నల్లో ప్రచురించబడిన అధ్యయనం ప్రకారం రోజువారీ వేడి స్నానం వారానికి ఒకటి లేదా రెండుసార్లు చేయడం కంటే ఎక్కువ ప్రయోజనాన్ని ఇస్తుందని అంటున్నారు. వేడి నీళ్లు రక్తపోటును నియంత్రణలో ఉంచుతాయని జపాన్ పరిశోధకుల అధ్యయనంలో తేలింది.
61,000 మంది మధ్య వయస్కులైన (45 నుండి 59 సంవత్సరాలు) వారిపై ది జపాన్ పబ్లిక్ హెల్త్ సెంటర్ పరిశోధనలు జరిపింది. జీవనశైలి, వ్యాయామం, ఆహారం, మద్యం తీసుకోవడం, బరువు, సగటు నిద్ర ఇవన్నీ కూడా గుండె పనితీరుపై ప్రభావం చూపిస్తాయి. ప్రభావవంతమైన కారకాలను పరిగణనలోకి తీసుకున్న తరువాత, వారానికి ఒకటి లేదా రెండుసార్లు వేడినీటి స్నానంతో పోల్చితే, రోజువారీ వేడి నీటి స్నానం హృదయ సంబంధ వ్యాధుల తీవ్రతను తగ్గించింది. ప్రమాదాల రేటును 35 శాతం తగ్గించిందని తెలిపింది. హృదయ సంబంధ వ్యాధులను ప్రారంభ దశలో గుర్తించి చికిత్స అందిస్తే తగ్గుముఖం పట్టగలవు. కానీ ఆలస్యమయితే పరిస్థితి చేయి దాటిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
అయితే రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి, మూర్చ వాధి సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకు వేడినీటి స్నానాన్ని సూచించలేదు. వేడి నీరు వారి సమస్యను మరింత జఠిలం చేస్తుందని తేలింది. గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు వేడి నీటి స్నానం చేసినప్పుడు శరీర ఉష్ణోగ్రతలు అకస్మాత్తుగా పెరగడం, హృదయనాళ వ్యవస్థలో కొంచెం ఒత్తిడికి గురవడం వంటి సమస్యలు కలుగుతాయి. ఆయా సమస్యలు ఉన్న వ్యక్తులు, వారికి ఉన్న ఆరోగ్య సమస్యలు అనుసరించి నడుచుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com