Jai Hind: 'జైహింద్' నినాద రూపకర్త హైదరాబాదీ..
Jai Hind: మాజీ ప్రభుత్వోద్యోగి నరేంద్ర లూథర్ తన 'లెంజెండోట్స్ ఆఫ్ హైదరాబాద్' (లెజెండ్స్ అండ్ ఎనెక్డోట్స్ ఆఫ్ హైదరాబాద్) పుస్తకంలో, 'జై హింద్' అనే పదాన్ని సృష్టించింది సుభాష్ చంద్రబోస్ కాదని, అతని కార్యదర్శి, నగరానికి చెందిన కలెక్టర్ కుమారుడు జైనుల్ అబిదీన్ హసన్ అని పేర్కొన్నారు.
'జై హింద్' నినాదం, భారతదేశ స్వాతంత్ర్య పోరాట కాలం నుండి దేశవ్యాప్తంగా సాధారణంగా ఉపయోగించే పదం.. ఈ పదాన్ని మొదట 'జై హిందుస్థాన్ కీ' యొక్క సంక్షిప్త రూపంగా ఉపయోగించారు. అయితే ఈ నినాదాన్ని సుభాష్ చంద్రబోస్ రూపొందించారని అందరూ అభిప్రాయపడుతుంటారు.
లూథర్ రాసిన పుస్తకంలో, అతను డాక్యుమెంటరీ సాక్ష్యం, ఇంటర్వ్యూలు, నగరంపై వ్యక్తిగత అనుభవాల ఆధారంగా అనేక ఆసక్తికరమైన కథనాలను అందించారు.
అమీర్ హసన్, ఫక్రుల్ హాజియా బేగం దంపతులకు ఏప్రిల్ 11, 1911న జైనుల్ అబిదీన్ హసన్ జన్మించారు. సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్ నుండి పాఠశాల విద్యను పూర్తి చేసిన ఆయన ఉన్నత చదువుల కోసం జర్మనీకి వెళ్లారు. అక్కడ చదువుకుంటున్న సమయంలో నేతాజీతో పరిచయం ఏర్పడింది. ఆయనే 'జై హింద్'ని రూపొందించారని రచయిత తెలిపారు.
"రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో, బోస్ భారతదేశాన్ని విముక్తి చేయడానికి సాయుధ పోరాటానికి మద్దతు ఇవ్వడానికి జర్మనీ వెళ్లారు. అక్కడ భారత యుద్ధ ఖైదీల సమావేశాలను ఉద్దేశించి ప్రసంగించారు. పోరాటంలో తనతో కలిసి రావాలని వారిని ప్రోత్సహించారు. ఈ క్రమంలో హసన్.. బోస్ని కలిశారు. బోస్ దేశభక్తికి ఉప్పొంగిపోయారు హసన్.. అతని స్ఫూర్తితో ప్రేరణ పొందారు. తన చదువు పూర్తయిన తర్వాత తాను కూడా బోస్తో చేయి కలపాలని నిశ్చయించుకున్నారు.
"బోస్ తన సైన్యానికి మరియు స్వతంత్ర భారతదేశానికి ఒక పదాన్ని రూపొందించాలని హసన్ని అడిగారు. దాంతో హసన్ మొదట 'హలో' అనే పదాన్ని సూచించారు. నేతాజీకి ఆ పదం అంతగా రుచించలేదు. దాంతో మరొక పదాన్ని సూచించమన్నారు. ఆ తరువాత హసన్ జై హిందుస్తానీ అనే నినాదాన్ని సూచించారు. దానినే నేతాజీ తర్వాత 'జై హింద్' గా మార్చారు. అప్పటి నుంచి జైహింద్ ఇండియన్ నేషనల్ ఆర్మీలో అధికారిక రూపంగా మారింది. తర్వాత అది దేశ అధికారిక నినాదంగా స్వీకరించబడింది" అని ఆయన పుస్తకంలో పేర్కొన్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com