కేంద్ర మాజీ మంత్రి జశ్వంత్ సింగ్ కన్నుమూత
కేంద్ర మాజీ మంత్రి జశ్వంత్ సింగ్ ఆదివారం ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన జూన్ 25న ఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రిలో మల్టీఆర్గాన్ డిసిన్ఫెక్షన్ సిండ్రోమ్ సెప్సిస్ చికిత్స పొందుతున్నారు. అయితే ఆయన పరిస్థితి విషమించడంతో ఉదయం 6.55కు తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపట్ల ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జశ్వంత్ సింగ్ సైనికుడిగా, రాజకీయ నేతగా దేశానికి సేవలందించారని ప్రధాని మోదీ అన్నారు. దేశ రాజకీయాల్లో ఆయన కీలక పాత్ర పోషించారని ప్రధాని ట్వీట్ చేశారు.
1938, జనవరి 3న రాజస్థాన్లోని జసోల్లో జన్మించిన జశ్వంత్ సింగ్.. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో పలుమార్లు కేంద్రమంత్రిగా పనిచేశారు. వాజ్పేయీ ప్రధానిగా ఉన్న సమయంలో రక్షణ, ఆర్థిక, విదేశాంగ వంటి శాఖలను సమర్థవంతంగా నిర్వర్తించారు. ఐదుసార్లు రాజ్యసభ సభ్యుడిగా, నాలుగుసార్లు లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా, రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా అనేక బాధ్యతలను చేపట్టారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com