Komatireddy Venkata Reddy: ప్రధానితో కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ.. ఏంటి సంగతి!!
Komatireddy Venkatareddy: తెలంగాణ రాజకీయాల్లో కొంతకాలంగా కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాట్ టాపిక్గా ఉన్నారు. మునుగోడు ఉప ఎన్నికల సమయం నుంచి ఆయన తీరు ఇటు పార్టీలోనూ.. అటు నియోజకవర్గంలోనూ చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్లో ఉన్నప్పటికీ ఆ పార్టీతో అంటీముట్టనట్టుగా ఉంటున్నారు ఆయన. పార్టీ రాష్ట్ర నాయకత్వం కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు.
ఈ క్రమంలో ఆయన ప్రధాని నరేంద్ర మోదీతోభేటీ అవుతుండడం సంచలనంగా మారింది. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాసేపట్లో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. పార్లమెంట్లోనే ఆయన్ను కలవనున్నారు. నియోజకవర్గ అభివృధ్ధి గురించే ప్రధాని మోదీని కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలుస్తున్నారని చెబుతున్నప్పటికీ.. ఈ భేటీకి రాజకీయ కారణాలు కూడా ఉండవచ్చనే ప్రచారం జరుగుతోంది.
ఇక AICC అధ్యక్షుడు ఖర్గేను కలిసిన కోమటిరెడ్డి వెంకట్రెడ్డి.. అరగంట పాటు చర్చించారు. సీనియర్లు పార్టీని వీడటంపై వెంకట్రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. జాతీయ స్థాయిలో ప్రాధాన్యత కల్పిస్తానంటూ వెంకటరెడ్డికి ఖర్గే హామీ ఇచ్చారు. తమ్ముడు పార్టీ మారినా వెంకట్రెడ్డి కాంగ్రెస్లోనే కొనసాగుతున్నందుకు ఖర్గేను అభినందించారు. ఈ నేపధ్యంలో కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ప్రధాని మోదీతో భేటీ కావడం పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది..
మరోవైపు.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో రోజుకో రచ్చ జరుగుతుంది.. పార్టీ వేసిన కమిటీల్లో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి చోటు దక్కలేదు. సమయం వచ్చినప్పుడు రాజకీయాలు మాట్లాడతానని.. ఇంకా కేంద్ర కమిటీలు వేసే అవకాశం ఉందని గతంలో చెప్పారు. అంతే కాకుండా పార్టీలో సీనియర్లకు గౌరవం దక్కడం లేదని ఆరోపించారు. ఇదే సమయంలో ప్రధాని మోదీతో భేటీ కావడం ఇంట్రెస్టింగ్ గా మారింది.. అయితే.. ఒక ఎంపీగా ప్రధానితో సమావేశం జరగడం కామన్ అని కోమటిరెడ్ది సన్నిహితులు చెబుతున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com