పండక్కి వద్దండి.. ముందే కొనేయండి..
రాబోయే కాలం పండగల సీజన్.. ఆఫర్లతో జోరందుకుంటుంది వ్యాపారం.. వినియోగ దారుడిని ఆకర్షించడానికి ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు ఎన్ని ఎత్తుగడలైనా వేసి మార్కెట్ని పెంచుకుంటాయి . కానీ స్మార్ట్ఫోన్ కొనుగోలు విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది. యాపిల్, శాంసంగ్, షావోమీ, ఒప్పో, రియల్మి వంటి పలు కంపెనీల స్మార్ట్ఫోన్ ధరలు పెరగనున్నాయి.
కేంద్ర ప్రభుత్వం తాజాగా 10 శాతం దిగుమతి సుంకాన్ని విధించింది. డిస్ప్లేస్, టచ్ ప్యానెల్స్కు కూడా ఇది వర్తిస్తుంది. స్మార్ట్ఫోన్ తయారీ కంపెనీలు దిగుమతి సుంకం పెంపు భారాన్ని కస్టమర్లకు బదిలీ చేయనున్నాయి. దీంతో స్మార్ట్ఫోన్ ధరలు పెరగొచ్చు. ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశీయంగా తయారీని పెంచాలని భావిస్తోంది. అందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
మోదీ సర్కార్ తాజా నిర్ణయంతో మొబైల్ ఫోన్ ధరలు పెరగొచ్చని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. స్మార్ట్ఫోన్ ధరలు 1.5 శాతం నుంచి 5 శాతం వరకు పెరగొచ్చని అంచనా వేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ సుంకం పెంపు కారణంగా పండుగ సీజన్లో స్మార్ట్ఫోన్ల కొనుగోళ్లపై ప్రతికూల ప్రభావం ఉండొచ్చని భావిస్తున్నారు.
నిజానికి 2019 ఏప్రిల్ నుంచే ఈ దిగుమతి సుంకాన్ని విధించాలని కేంద్ర ప్రభుత్వం భావించింది. కానీ ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకుని దేశీ తయారీ కంపెనీలకు మరింత గడువు ఇచ్చింది. కేంద్ర నిర్ణయంతో కంపెనీలు ధరలు పెంచే అవకాశం ఉంది. మరికొన్ని కంపెనీలు మాత్రం వినియోగ దారుడిని దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగుతాయి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com