Mundra Drugs Case: ముంద్రా పోర్టు డ్రగ్స్ కేసులో NIA దూకుడు..
Mundra Drugs Case: ముంద్రా పోర్టు డ్రగ్స్ కేసులో NIA దూకుడు పెంచింది. ఈ కేసులో రెండవ సప్లిమెంటరీ ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఛార్జిషీట్లో 22మందిపై అభియోగాలు మోపింది. ఇక నిందితుల్లో మాచవరం సుధాకర్ అనే తెలుగు వ్యక్తి కూడా ఉన్నాడు. ముద్రా పోర్టు డ్రగ్స్ కేసులో ఏపీకి లింకులు ఉన్నాయని బయటపడటం అప్పట్లో సంచలనం సృష్టించింది. విజయవాడలో ఆషి కంపెనీ పేరుతో మాచవరం సుధాకర్, ఆయన భార్య వైశాలి వ్యవహారాలు నిర్వహించారు.
ఇక ఫేక్ కంపెనీలు, షెల్ కంపెనీల పేరుతో ఆఫ్గానిస్తాన్ నుంచి దిగుమతులు చేసుకుంటున్నట్లు గుర్తించింది. ముంద్రా పోర్టులో 20 వేల కోట్ల విలువైన 3వేల కేజీల హెరాయిన్ను అధికారులు సీజ్ చేశారు. ముంద్రా, కోల్కత్తా పోర్టుల ద్వారా భారీగా డ్రగ్స్ దిగుమతి అవుతున్నట్లు గుర్తించారు. నిందితులు డ్రగ్స్ను న్యూఢిల్లీలోని వేరువేరు గోదాముల్లో భద్రపరిచినట్లు అధికారులు తెలిపారు. డ్రగ్స్ విక్రయాల ద్వారా వచ్చే డబ్బులను నిందితులు ఉగ్రవాద సంస్థలకు పంపిస్తున్నట్లు గుర్తించారు. ఇక ప్రధాన నిందితుడు హర్ ప్రీత్ సింగ్ తల్వార్ ఢిల్లీలో పలు నైట్ క్లబ్లు, హోటళ్లు, రిసార్టులు, రిటైల్ షోరూంలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఇతర దేశాల నుంచి ఢిల్లీకి వచ్చిన ముడిసరుకును ప్రాసెస్ చేసి.. ఢిల్లీలో స్థిరపడ్డ ఆఫ్గాన్ దేశీయులతో హెరాయిన్ తయారు చేయిస్తున్నట్లు గుర్తించామని NIA అధికారులు వెల్లడించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com