National: శివసేన పార్టీ ఏక్ నాథ్ షిండేదే: ఈసీ

శివసేన పార్టీ ఏక్ నాథ్ షిండేదేనని ఈసీ చెప్పడంపై మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రే మండిపడ్డారు. విల్లు, బాణం గుర్తును ఏక్నాథ్ షిండే వర్గానికి కేటాయించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈసీ ప్రకటనతో ఉద్ధవ్ ఇంటి వద్దకు ఆయన అనుచరులు భారీగా చేరుకుని ఆందోళనకు దిగారు. ఉద్ధవ్కు మద్దతుగా నినాదాలు చేశారు. భారీ సంఖ్యలో కార్యకర్తలు ఇంటికి చేరడంతో అక్కడ పరిస్థితి ఉద్విగ్నంగా మారింది. పార్టీ పేరు, గుర్తును తమ ప్రత్యర్థికి కేటాయించడంపై ఉద్ధవ్ థాక్రే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం ప్రధాని మోదీకి బానిస అయ్యిందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. గత 75 ఏండ్లలో ఇలా జరగడం మొదటిసారని, గతంలో కాంగ్రెస్ ఎన్నికల గుర్తును ఇలాగే నిలిపివేసినా, దానిని ఏ పార్టీకి కేటాయించలేదన్నారు. మోదీకి అనుకూలంగా ప్రకటన చేసిన ఎలక్షన్ కమిషనర్ రిటైరైన తర్వాత గవర్నర్ కావొచ్చేమోనని థాక్రే అన్నారు. ఇక శివసేన పార్టీ అసలు వారసులెవరో ప్రజలే నిర్ణయిస్తారని... త్వరలో జరిగే ముంబై కార్పొరేషన్ ఎన్నికల్లో ఆ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని ఉద్ధవ్ థాక్రే పిలుపునిచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com