National: ప్రశాంతంగా నాగాలాండ్, మేఘాలయ అసెంబ్లీ ఎన్నికలు

నాగాలాండ్, మేఘాలయ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. రెండు రాష్ట్రాల్లో 60 స్థానాల చొప్పున మొత్తం 120 స్థానాలు ఉన్నాయి. అయితే మేఘాలయలో ఓ అభ్యర్థి మరణించగా.. నాగాలాండ్లో ఓ నియోజకవర్గం ఏకగ్రీవమైంది. దీంతో రెండు రాష్ట్రాల్లో 59 స్థానాల చొప్పున ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక ఓట్ల లెక్కింపు మార్చి 2న జరగనుంది.
మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. గారో హిల్స్లోని తురా పోలింగ్ స్టేషన్లో ఓటు వేశారు. నాగాలాండ్ ముఖ్యమంత్రి నైఫుయో రియో సైతం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొహిమాలోని పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక మేఘాలయలో మధ్యాహ్నం 2 గంటల వరకు 51 శాతం నమోదైందని ఎన్నికల సంఘం ప్రకటించింది. మరోవైపు నాగాలాండ్లో మధ్యాహ్నం 2 గంటల వరకు 65 శాతం నమోదైందని తెలిపారు.
మేఘాలయలో అన్ని పార్టీల నుంచి 369 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. వీరిలో 36 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. 21 లక్షల మంది ఓటర్ల కోసం 3వేల 419 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో అధికార ఎన్పీపీ, ప్రతిపక్ష కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటీ కనిపిస్తోంది. మరోవైపు నాగాలాండ్లో మొత్తం 183 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ రాష్ట్రంలో దాదాపు 13 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వారికోసం 2వేల 291 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అధికార ఎన్డీపీపీ, బీజేపీతో పొత్తు పెట్టుకొని ఎన్నికల బరిలో నిలిచింది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com