National: గాల్లోకి దూసుకెళ్లిన బ్రహ్మోస్

భారత్, రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేసిన సూపర్ సోనిక్ క్రూయిజ్ మిస్సైల్ బ్రహ్మోస్ ను మరోసారి విజయవంతంగా పరీక్షించారు. అరేబియా సముద్రంలో మోహరించిన కోల్ కతా శ్రేణి యుద్ధనౌక నుంచి గాల్లోకి దూసుకెళ్లిన బ్రహ్మోస్ ఆశించిన ఫలితాలను ఇచ్చిందని భారత నేవీ ప్రకటించింది. ఇందులో స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన సీకర్ అండ్ బూస్టర్లను ఉపయోగించినట్లు నేవీ ఉన్నతాధికారులు తెలిపారు. సీకర్ బూస్టర్లను డీఆర్డీవో తయారు చేసింది. రక్షణ రంగంలో ఆత్మనిర్భర్ భారత్ పట్ల తమ నిబద్ధతను ఇది బలపరుస్తోందని ఇండియన్ నేవీ వెళ్లడించింది.
భారత్-రష్యాలు సంయుక్తంగా ఈ బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణులను తయారు చేస్తున్నాయి. వీటిని జలాంతర్గాములు, నౌకలు, విమానాల నుంచి కూడా ప్రయోగించేందుకు వీలుగా రూపొందిస్తున్నారు. ఈ బ్రహ్మోస్ క్షిపణి ధ్వని వేగానికి మూడురెట్ల వేగంతో ప్రయాణించగలిగే సామర్థ్యం కలిగి ఉంది. గతేడాది ఏప్రిల్లో భారత్ నేవీ, అండమాన్ నికోబార్ కమాండ్తో కలిసి యాంటి షిప్ వెర్షన్ సూపర్ సోనిక్ క్రూయిస్ క్షిపణలను పరీక్షించింది. మరోవైపు భారత్ ఈ బ్రహ్మోస్ మిస్సైళ్లను ఇతర దేశాలకు సైతం ఎగుమతి చేస్తోంది. ఈ క్షిపణుల మూడు బ్యాటరీలను సరఫరా చేసేందుకు గతేడాది జనవరిలో ఫిలిప్పీన్స్తో 375 మిలియన్ డాలర్ల ఒప్పందం కుదుర్చుకుంది
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com