కరోనా ఎఫెక్ట్… నీట్ 2021 పరీక్షలు మరో నాలుగు నెలలు వాయిదా..!

దేశంలో కరోనా రక్కసి ఉగ్రరూపం దాల్చిన వేళ... కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొవిడ్ బాధితులకు చికిత్సలు అందించేందుకు ఎంబీబీఎస్ ఉత్తీర్ణులు, చివరి సంవత్సరం చదివే విద్యార్థులను విధుల్లోకి తీసుకునేందుకు సిద్ధమైంది. ఇందుకోసం నీట్-పీజీ పరీక్షను నాలుగు నెలల పాటు వాయిదా వేసింది. కొవిడ్పై పోరు వైద్య సిబ్బంది కొరత ఏర్పడకుండా ఉండేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రధానమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.
ప్రధాని మోదీ ఆదివారం పలువురు ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో వైద్య విద్యార్థుల సేవలను వినియోగించుకునే అంశం చర్చకు వచ్చింది. ఎంబీబీఎస్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులను బోధకుల పర్యవేక్షణలో.... స్వల్ప లక్షణాలున్న కొవిడ్ బాధితులకు చికిత్సలు అందించే విధుల్లో ఉపయోగించుకోవచ్చని పీఎంవో తెలిపింది. అలాగే బీఎస్సీ, జీఎన్ఎం ఉత్తీర్ణులైన నర్సులను.. సీనియర్ డాక్టర్లు, సీనియర్ నర్సుల పర్యవేక్షణలో పూర్తి స్థాయి కొవిడ్ నర్సింగ్ విధుల్లోకి తీసుకోవచ్చని పేర్కొంది.
కొవిడ్ సేవల్ని దృష్టిలో పెట్టుకుని.... నీట్ పీజీ పరీక్షను నాలుగు నెలలు వాయిదా వేయాలని నిర్ణయించినట్టు పీఎంవో తెలిపింది. ఈ పరీక్ష ఏప్రిల్ 18న జరగాల్సి ఉండగా కరోనా దృష్ట్యా వాయిదా వేస్తున్నటటు ఇటీవల కేంద్రం ప్రకటించింది. తాజాగా మరో నాలుగు నెలలు వాయిదా వేసింది. అంతేకాకుండా... 100 రోజులు కరోనా విధుల్లో ఉన్న వైద్య సిబ్బందికి భవిష్యత్తులో జరగబోయే ప్రభుత్వ నియామకాల్లో ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com