నీట్ పరీక్ష వాయిదా వేయడం కుదరదన్న సుప్రీంకోర్టు.. సెప్టెంబర్ 12నే పరీక్ష..!
నీట్ పరీక్ష వాయిదా వేయడం కుదరదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 12న నీట్ పరీక్ష జరగనుంది. నీట్-2021 పరీక్షను వాయిదా వేయాలని లేదా రీషెడ్యూల్ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. ముందుగా చెప్పిన షెడ్యూల్ ప్రకారం సెప్టెంబరు 12 ఆదివారం నీట్ పరీక్ష జరుగుతుందని స్పష్టం చేసింది. సెప్టెంబర్ 12న ఇతర పోటీ పరీక్షలు ఉండటంతోపాటు.. సీబీఎస్ఈ కంపార్ట్మెంట్ పరీక్షలు కూడా జరుగుతున్నాయని.. అందువల్ల పరీక్షను మరో తేదీకి వాయిదా వేయాలని పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లను విచారించేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. నీట్ పరీక్షను 16 లక్షల మందికి పైగా విద్యార్థులు రాయనున్నారని ... కేవలం కొందరు విద్యార్థుల కోసం పరీక్షను వాయిదా వేయలేమని స్పష్టం చేసింది. విద్యా వ్యవహారాలపై మేం ఎక్కువగా జోక్యం చేసుకోలేమని.. మా తీర్పుల వల్ల లక్షలాది మంది విద్యార్థులు ప్రభావితమవుతారని సుప్రీం కోర్టు పేర్కొంది. ఒకవేళ ఒకే రోజు ఎక్కువ పరీక్షలు ఉంటే.. ఏదో ఒకదాన్ని ఎంచుకోవాలి.. అంతేగానీ, నీట్ను వాయిదా వేయడం కుదరదని సుప్రీం కోర్టు చెప్పింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com