ఏడాదిలోగా అన్ని టోల్ప్లాజ్లు తొలగిస్తాం : కేంద్రమంత్రి గడ్కరీ

ఏడాదిలోగా దేశంలోని అన్ని టోల్ప్లాజాలను పూర్తిగా తొలగిస్తామన్నారు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ. దీని స్థానంలో జీపీఎస్ ఆధారిత టోల్ వసూళ్ల వ్యవస్థను తీసుకొస్తామన్నారు. లోక్సభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఈ విషయం వెల్లడించారు. అన్ని టోల్బూత్లను తొలగిస్తామని సభలో హామీ ఇస్తున్నామని, ఇకపై జీపీఎస్ ఆధారంగా టోల్ వసూళ్లు చేపడతామన్నారు. వాహనానికి ఉన్న జీపీఎస్ ఆధారంగా వాహనదారుల బ్యాంకు ఖాతా నుంచి నేరుగా టోల్ మొత్తాన్ని మినహాయించుకునే కొత్త వ్యవస్థను తీసుకొస్తున్నట్లు గడ్కరీ వివరించారు.
దేశవ్యాప్తంగా 93శాతం వాహనదారులు ఫాస్టాగ్ ద్వారానే టోల్ చెల్లిస్తున్నారన్నారు. మిగిలిన 7శాతం మంది మాత్రం రెట్టింపు టోల్ కడుతున్నా ఫాస్టాగ్ ఉపయోగించడం లేదన్నారు కేంద్రమంత్రి గడ్కరీ. ఫాస్టాగ్ ద్వారా టోల్ చెల్లించని వాహనదారులపై పోలీసుల దర్యాప్తునకు ఆదేశించినట్లు తెలిపారు. టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు 2016లో ఫాస్టాగ్లను తీసుకొచ్చింది కేంద్రం. ఫిబ్రవరి 16 నుంచి అన్ని జాతీయ రహదారులపై వీటి వినియోగాన్ని తప్పనిసరి చేశారు. ఫాస్టాగ్ లేని వారి నుంచి రెట్టింపు టోల్ వసూలు చేస్తున్నారు.
అయితే ఇప్పుడు అన్ని వాహనాల్లో వెహికల్ ట్రాకింగ్ వ్యవస్థ వస్తున్నందున.. టోల్ వసూలుకు కూడా జీపీఎస్ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని గతంలో కేంద్రం నిర్ణయం తీసుకుంది. టోల్గేట్ల వద్ద ఆగాల్సిన పనిలేకుండా జీపీఎస్ ఆధారంగా టోల్ చెల్లించే సదుపాయాన్ని తీసుకొస్తోంది. జీపీఎస్ ఆధారంగా... వాహన కదలికలను బట్టి వినియోగదారు బ్యాంకు ఖాతా నుంచి నేరుగా టోల్ మొత్తాన్ని మినహాయించుకొనే కొత్త వ్యవస్థను తీసుకొస్తున్నట్లు గడ్కరీ గతంలో వెల్లడించారు. నూతన విధానం అమల్లోకి వస్తే.. వాహనదారులు జాతీయ రహదారిపై ప్రయాణించిన దూరానికే టోల్ ఛార్జీలు పడతాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com