దూసుకొస్తున్న నివర్ తుపాను

నివర్ తుపాను దూసుకొస్తోంది.. ఇప్పటికే చెన్నైలో భారీగా వర్షాలు పడుతున్నాయి కూడా.. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత బలపడింది. వాయుగుండం ప్రస్తుతం పుదుచ్చేరికి తూర్పు ఆగ్నేయంగా 450 కిలోమీటర్లు, చెన్నైకి ఆగ్నేయంగా 480 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. వచ్చే 12 గంటల్లో ఈ వాయుగుండం తుపానుగాను, 24 గంటల్లో తీవ్ర తుపానుగా మారనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఈ నెల 25 సాయంత్రం తమిళనాడులోని మమాళ్లపురం- కరైకల్ మధ్య తీరం దాటే అవకాశముందన్నారు. తీరం దాటే సమయంలో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించారు. దీని ప్రభావంతో తమిళనాడు సహా దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీచేశారు. సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని సూచించారు.
తుపాను హెచ్చరికలతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. వ్యవసాయ, వైద్య, ఆరోగ్య, విపత్తు నిర్వహణ, రెవెన్యూ శాఖలను అప్రమత్తం చేసింది. నెల్లూరు, చిత్తూరు, అనంతపురం కడప జిల్లాల్లో తుపాను ప్రభావం అధికంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com