ఓసి నా అప్పడమో ఎంత పని చేశావే.. తల పట్టుకున్న ప్రభుత్వం
ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందని.. అప్పడాలపై జీఎస్టీ విధించి ఆనక తలకొట్టుకుంటోంది ప్రభుత్వం. ఒక అప్పడం ఇంత పని చేస్తుందని అస్సలు ఊహించలేదు. అన్నిటితో పాటే అప్పడాలపై కూడా జీఎస్టీ విధించి డబ్బులు దండుకుందామనుకుంది. కానీ సోషల్ మీడియా వేదికగా చర్చలు, వాదోపవాదనలు. చివరకు కేంద్రం జోక్యం చేసుకుని సర్ధుబాటు ప్రయత్నాలు..
గుండ్రంగా ఉన్న అప్పడాలకి జీఎస్టీ మినహాయింపు.. చతురస్రాకారపు అప్పడాలకు ఎంతోకంత జీఎస్టీ కట్టాడలనడం ఏం దౌర్భాగ్యం అంటూ హర్ష్ గోయెంకా ట్విట్టర్లో ఓ పోస్ట్ పెట్టారు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఆర్పీజీ ఇండస్ట్రీస్ చైర్మన్ అయిన గోయెంకా ఆకారంలో తేడా ఉన్న అప్పడాలపై జీఎస్టీ ఎందుకు విధిస్తున్నారు. ఇందులో లాజిక్ ఏముంది. ఎవరైనా చార్టెడ్ అకౌంటెంట్ బదులివ్వాలని అడిగారు.
గోయెంకా ట్వీట్పై పెద్ద ఎత్తున నెటిజన్లు స్పందించారు. గుండ్రటి అప్పడాలు చేతితో చేస్తారు, చతురస్రాకారపు అప్పడాలు మెషీన్తో చేస్తారు అందుకే వాటిపై జీఎస్టీ అని కొందరు తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. మరికొందరు మరింత ముందుకెళ్లి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ని టార్గెట్ చేశారు. ఇది పనికిమాలిన చర్య అని దుమ్మెత్తిపోశారు. ట్వీట్ పోస్ట్ చేసి 24 గంటలు గడవక ముందే వేలాది మంది దీనిపై స్పందించంతో ప్రభుత్వం దిగి వచ్చింది.
ట్విట్టర్ వేదికగా ప్రభుత్వంపై విమర్శలు పెరిగిపోవడంతో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్ డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ విభాగం స్పందించింది. అప్పడం ఎలా ఉన్నా జీఎస్టీ విధించట్లేదు అని విమర్శించిన వారందరికీ ఓ నమస్కారం పెట్టింది. ఈ మేరకు హర్ష్ గోయెంకా ట్వీట్కి రిప్లై ఇచ్చింది. ఆల్కహాల్, పెట్రోల్ ఉత్పత్తులు తప్ప దాదాపు అన్ని రకాల ఉత్పత్తులు జీఎస్టీ పరిధిలో ఉన్నాయని పేర్కొంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com