చీపురు పట్టిన చేతులతోనే అధికారిగా బాధ్యతలు చేపట్టి..

ఆమెది ఆఫీసులో స్వీపర్ ఉద్యోగం.. అధికారులు వచ్చే టైంకి ఆఫీస్ అంతా ఊడ్చాలి. టేబుళ్లు, కుర్చీలు శుభ్రం చేయాలి. ఇలా పదేళ్లుగా ఇదే ఉద్యోగం.. అదే ఆమె ఇప్పుడు అధికారిగా బాధ్యతలు చేపట్టారు. కేరళకు చెందిన ఆనందవల్లి కొల్లాం జిల్లాలో ఈ మధ్య జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పఠాన్పురం పంచాయితీ వార్డు సభ్యురాలిగా ఎన్నికయ్యారు.
పంచాయితీ అధ్యక్షురాలిగా ఆమె పేరును పార్టీ పెద్దలు ఖరారు చేయడంతో అందరితో పాటు ఆనందవల్లి కూడా ఆశ్చర్యపోయారు. రెండు రోజుల క్రితం ఆనందవల్లి పఠాన్పురం పంచాయితీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించారు. పెయింటింగ్ పని చేసే ఆమె భర్త మోహనన్ స్థానిక సీపీఎం కమిటీలో సభ్యుడు. వీరికి ఇద్దరు పిల్లలు.
భార్యాభర్తలిరువురూ మొదటి నుంచి కమ్యూనిస్ట్ పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనేవారు. మొదటి సారి పోటీ చేసి విజేతగా నిలిచారు ఆనందవల్లి. పంచాయితీ సభ్యులు చప్పట్లు కొడుతూ ఆమెను ప్రెసిడెంట్ కుర్చీలో కూర్చోబెట్టారు. ఆ సమయంలో ఆనందవల్లి కళ్లలో ఆనందభాష్పాలు కదలాడాయి.
నా జీవితంలో మరిచిపోలేని రోజు ఇది. నాపై ఎంత పెద్ద బాధ్యత ఉందో నాకు తెలుసు. నేను వారి రుణం తీర్చుకోలేను. కొంత భయంగా ఉన్నా పంచాయితీ సభ్యుల సహకారంతో ఈ బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తా. మా పంచాయితీని రాష్ట్రంలోనే ఆదర్శ పంచాయితీగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తానని అంటున్నారు ఆనందవల్లి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com