Parliament winter Session: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు..

Parliament Winter Sessions: శీతాకాల పార్లమెంట్ సమావేశాలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఈ నెల 29 వరకు జరగనున్న ఈ సమావేశాలు వాడీవేడీగా జరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఉభయసభలు మొత్తం 23 రోజుల వ్యవధిలో 17 సార్లు సమావేశం కానున్నాయి. కేంద్రం మొత్తం 16 బిల్లులు ప్రవేశపెట్టనుంది. అలాగే పెండింగ్లో ఉన్న మరో ఏడు బిల్లులు, రెండు ఆర్థిక బిల్లులు మొత్తం 23 బిల్లులు సభ ముందుకు రానున్నాయి.
అయితే, బయోలాజికల్ డైవర్సిటీ, మల్టీ స్టేట్ కోపరేటివ్ సొసైటీలు, అటవీ సంరక్షణ చట్ట సవరణ బిల్లులను వ్యతిరేకిస్తున్నామని కాంగ్రెస్ ఇప్పటకే స్పష్టం చేసింది. ఈ మూడు బిల్లులను స్థాయి సంఘం పరిశీలనకు పంపాలని..ఆ మూడు బిల్లులపై విస్తృత చర్చ జరగాలని కాంగ్రెస్ కోరుతోంది. మహిళా రిజర్వేషన్ బిల్లును ఈ సమావేశాల్లో పలు పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.
ఇక ఈ సమావేశాల్లో దేశ ఆర్థిక పరిస్థితులు, రాజ్యాంగ సంస్థలను బలహీనపర్చడం, సరిహద్దుల్లో చైనా దురక్రమణలు, EWS రిజర్వేషన్ అంశంపై ప్రశ్నిస్తామని కాంగ్రెస్ స్పష్టం చేసింది. అధిక ధరలు, కేంద్ర ప్రభుత్వ సంస్థల దుర్వినియోగం, నిరుద్యోగం వంటి అంశాలపై చర్చకు విపక్షాలు డిమాండ్ చేయనున్నాయి.
ఇక ఈ సమావేశాల్లో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కీలక అంశాలు చర్చకు రానున్నట్లు తెలుస్తోంది. ఏపీలో అధికార దుర్వినియోగం, వ్యవస్థల నిర్వీర్యం, ఏపీ రాజధానిగా అమరావతి, కేంద్రం నిధులను దారి మళ్లిస్తున్న జగన్ సర్కార్ వైఖరి లాంటి అంశాలను పార్లమెంట్లో తెలుగుదేశం ప్రస్తావించనుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com