అలాంటి నాయకులు మాకు అవరసం లేదు: రాహుల్
Rahul Gandhi file photo
Rahul Gandhi: కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ మరోసారి తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీకి ఏ మాత్రం భయంలేని నాయకులు మాత్రమే కావాలన్నారు. పిరికివారికి పార్టీలో స్థానం లేదని పునర్ ఉద్ఘాటించారు. భయపడే వారంతా పార్టీని వీడి ఆరెస్సెస్ లో చేరండంటూ వ్యాఖ్యానించారు. పార్టీ సోషల్ మీడియా బృందంతో శుక్రవారం రాహుల్ గాంధీ సమావేశమైన సందర్బంగా ఈ వ్యాఖ్యలు చేశారు. నిర్భయంగా మాట్లాడే ఎంతో మంది ప్రజలు పార్టీ బయట ఉన్నారన్నారు. వారిని కాంగ్రెస్లో చేర్చుకునేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీలో కొందరు భయస్థులు ఉన్నారు. వారిని బయటకు విసిరేయండన్నారు. పిరికివారంతా పార్టీని వీడి ఆరెస్సెస్ వైపు వెళ్లండన్నారు.
పిరికివారి సేవలు పార్టీకి అవసరం లేదన్నారు రాహుల్ గాంధీ. పార్టీకి భయం లేని నాయకులే కావాలని, అదే తమ సిద్ధాంతమని స్పష్టం చేశారు. అసమ్మతివాదులను ఉద్దేశించే రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఎన్నికల వ్యూహకర్తగా పేరొందిన ప్రశాంత్ కిశోర్తో భేటీ అయిన కొద్ది రోజులకే రాహుల్ ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. వచ్చే ఏడాది పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడంతో రాజకీయ పార్టీలు ఇప్పటినుంచే వ్యూహాలు రచిస్తున్నాయి. ఇందులో భాగంగా రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో సమావేశమైనట్లు తెలుస్తోంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com