పొలిటికల్ ఎంట్రీపై అభిమానుల్ని మరోసారి నిరాశపరచిన తలైవా

తమిళ సూపర్ స్టార్ తలైవా.. మరోసారి అభిమానుల్ని నిరాశ పరిచారు. కనీసం ఈ సారైన తమ అభిమాన నాయకుడి పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ వస్తుందనుకున్న సమయంలో... తలైవా రజనీకాంత్ ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో రజనీ అభిమానులకు మరోసారి నిరాశ తప్పలేదు. తమిళనాడులో శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తన అభిమాన సంఘాలైన రజనీ మక్కళ్ మండ్రం-ఆర్ఎంఎం నిర్వాహకులతో రజనీకాంత్ సమావేశమయ్యారు. స్థానిక రాఘవేంద్ర కళ్యాణమండపంలో మక్కళ్ మండ్రం 30 జిల్లాల కార్యదర్శకులతో భేటీ అయ్యారు. రాజకీయ అరంగేట్రం గురించి చర్చించడానికే ఈ సమావేశం ఏర్పాటు చేశారనే అభిప్రాయాలు వినిపించాయి. 35 నిమిషాలకుపైగా జరిగిన సమావేశం తర్వాత.. రజనీ ఎలాంటి ప్రకటన చేయలేదు.
శాసనసభ ఎన్నికలకు సన్నాహాలు మొదలుపెట్టిన అధికార, ప్రతిపక్షాలు ఈ సమావేశంపై దృష్టి పెట్టాయి. సరికొత్త అంచనాలు, విశ్లేషణలు మళ్లీ తెరపైకి వచ్చాయి. రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై చాలా ఏళ్లుగా చర్చ జరుగుతూనే ఉంది. మూడేళ్ల క్రితం రజనీ ఆ ఉత్కంఠకు తెరదించారు. రాజకీయాల్లోకి వస్తానంటూ ప్రకటించినా.. పార్టీ ప్రారంభించలేదు. క్రియాశీలక రాజకీయాలకు దూరంగానే ఉంటున్నారు.
తాజాగా.. అభిమాన సంఘాల నిర్వాహకులతో..రజనీ నిర్వహించిన సమావేశం.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కనీసం ఈసారైనా తలైవా ప్రకట చేస్తారని అంతా భావించారు. కానీ ... సమావేశం ముగిశాక రజనీ కాంత్ ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో... అభిమానులంతా నీరసించారు. మీటింగ్ అయిపోయాక రజనీ హడావుడిగా ఇంటికి వెళ్లిపోయారు. అభిమానులను సముదాయించలేక రజనీకాంత్ ఇబ్బంది పడాల్సి వచ్చింది.
అంతకుముందు... సమావేశం హాలు వెలుపల... రజనీ ఫ్యాన్స్ సందడి కొనసాగింది. తలైవా సీఎం అంటూ అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అటు.. సమావేశంలోనూ.. ఇప్పటికే ఆలస్యమైంది... ఇంకా లేట్ అయితే మనకే నష్టమంటూ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేసినట్టు సమాచారం. అటు రాఘవేంద్ర కళ్యాణమండపం వెలుపల ఫ్యాన్స్ .. .మాత్రం.. తలైవా సీఎం అంటూ పెద్ద ఎత్తు నినాదాలు చేస్తూ హుషారుగా కనిపించారు.
కొన్నాళ్లుగా స్తబ్దుగా ఉన్న రజనీకాంత్.. మరోసారి పొలిటికల్ ఎంట్రీపై హీట్ పెంచారు. అభిమాన సంఘాలన రజనీ మక్కళ్ మండ్రం బలోపేతానికి రజనీకాంత్ చర్యలు చేపట్టారు. జిల్లాలవారీగా నిర్వాహకులతో తరచూ సమావేశాలు, ఆన్లైన్ ద్వారా సభ్యత్వ నమోదు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రాజకీయ పార్టీ ప్రారంభానికి బలమైన పునాదులు వేస్తున్నారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. రజనీ రాజకీయ అరంగేట్రం ప్రకటన తర్వాత.. ప్రముఖ నటుడు కమల్హాసన్ మక్కళ్ నీది మయ్యం పార్టీ స్థాపించారు. లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థులను బరిలోకి దించి ప్రధాన పార్టీలకు దీటైన పోటీ ఇచ్చారు. రజనీకాంత్ మాత్రం 2021 శాసనసభ ఎన్నికలే లక్ష్యమని వెల్లడించారు. శాసనసభకు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అందరి దృష్టి రజనీకాంత్పై నిలిచింది.
రజనీ రాజకీయ ప్రవేశంపై ఇప్పటికే పలుమార్లు ప్రచారం జరిగింది. ప్రస్తుతం ఆయన పుట్టినరోజు డిసెంబరు 12న ప్రకటన వెలువడొచ్చనే ప్రచారం ఊపందుకుంది. అంతలో మక్కళ్ మండ్రం జిల్లా కార్యదర్శులతో ఈరోజు సమావేశం కావడం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే.. అభిమానుల సంఘాల సమావేశంపై సర్వత్రా ఉత్కంఠత రేపినప్పటికీ.. రజనీ నుంచి పొలిటికల్ ఎంట్రీపై ఎలాంటి ప్రకటన రాకపోవడంతో.. తలైవా ఫ్యాన్స్ మరోసారి నిరాశకు గురయ్యారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com