RBI: లాకర్లపై ఆర్బీఐ కొత్త నిబంధనలు

బ్యాంకు లాకర్లపై ఆర్బీఐ కొత్త నిబంధనలు తీసుకువచ్చింది. లాకర్లలలో నగదు దాచడంపై పలు ఆంక్షలు విధించింది. బ్యాంకులతో కస్టమర్లు కొత్త అగ్రిమెంటు చేసుకోవాలని సూచించింది. ఇందుకు రెండు వందల రూపాయల స్టాంపు పత్రాలపై నోటరీ చేయించి బ్యాంకులో ఇవ్వాలని ఆర్బీఐ క్లారిటీ ఇచ్చింది. ఈ గడువు జనవరి 1 తోనే ముగిసింది. అగ్రిమెంట్ చేసుకోని వినియోగదారుల లాకర్లను కొన్ని బ్యాంకులు సీజ్ చేశాయి. అయితే చాలామంది ఇంకా ఒప్పందాలు చేసుకోకపోవడంతో గడువును డిసెంబరు 31 వరకు ఆర్బీఐ పొడిగించింది. ఈ నేపథ్యంలో సీజ్ చేసిన లాకర్లను తిరిగి వినియోగించుకునే సదుపాయం కల్పించాలంటూ అన్ని బ్యాంకులకు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. కొత్త ఒప్పందాల విషయంలో బ్యాంకులకు దశలవారీగా లక్ష్యాలను పెట్టింది. వచ్చే జూన్ 30కల్లా 50 శాతం, సెప్టెంబరు 30కల్లా 75, డిసెంబరు 31కల్లా 100 శాతం మంది వినియోగదారుల నుంచి పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
గతంలో పెద్ద నోట్ల రద్దు సమయంలో లాకర్ల నుంచి కట్టలు బయటికి తెచ్చి మార్చుకున్నట్లు అనుమానాలున్నాయి. ఈ నేపథ్యంలో నగదు విషయంలో లాకర్ల నిబంధనల్లో ఆర్బీఐ మార్పులు చేసినట్లు సమాచారం. లాకర్లలో నగదు నిల్వలను కంట్రోల్ చేయాలని కోరింది ఆర్బీఐ. లాకర్లలో ఏమేం దాచుకోవాలి, ఏమేం పెట్టకూడదనే అంశాలపై మార్గదర్శకాలను విడుదల చేసింది.
బ్యాంక్ కస్టమర్ అడ్రస్, ఇతర వివరాలు ఏమీ మారలేదని (సెల్ఫ్ డిక్లరేషన్ ను ఆన్లైన్లో సేకరించాలని సూచించింది. వివరాలు మారితే కేవైసీ వివరాలు అప్డేట్ చేయాలని సూచించింది. చిరునామా మారిన వివరాల పత్రాలను వినియోగదారులు ఆన్లైన్లో పంపితే రెండు నెలల్లోగా తనిఖీ పూర్తిచేయాలని స్పష్టం చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com