అమీర్‌పేట్ చౌరస్తాలో ఘోర ప్రమాదం.. మెట్రో రైలింగ్‌లో తల ఇరుక్కుని..

అమీర్‌పేట్ చౌరస్తాలో ఘోర ప్రమాదం.. మెట్రో రైలింగ్‌లో తల ఇరుక్కుని..
హైదరాబాద్‌లోని అమీర్‌పేట చౌరస్తాలో ఈ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

ఇంటి నుంచి బయటకు వస్తే మళ్లీ ఇంటికి క్షేమంగా చేరుతామో లేదో అన్న అనుమానం.. ప్రమాదం ఏ రూపంలో పొంచి ఉంటుందో అర్థం కావట్లేదు.. గత వారం రోజులుగా రోడ్డు ప్రమాద వార్తలు ఎక్కువగా జరుగుతున్నాయి. తాజాగా హైదరాబాద్‌లోని అమీర్‌పేట చౌరస్తాలో ఈ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

పోలీసులు అందించిన సమాచారం ప్రకారం కేపీహెచ్‌బీ కాలనీలో నివాసం ఉంటున్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన గిరీష్ గుప్తా (24), అతని స్నేహితుడు రవితేజతో కలిసి ద్విచక్రవాహనంపై అతి వేగంతో కూకట్‌పల్లి వైపు వెళుతున్నారు. ఈ క్రమంలో పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని అమీర్‌పేట మెట్రో స్టేషన్ వద్దకు రాగానే ద్విచక్రవాహనం అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో గిరీష్ తల మెట్రో స్టేషన్ రైలింగ్‌లో ఇరుక్కుపోయి అక్కడికక్కడే మృతి చెందాడు.

తీవ్రంగా గాయపడిన రవితేజను ఉస్మానియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతడి పరిస్థితి కూడా విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. గ్యాస్ కట్టర్‌తో ఇనుపకడ్డీలను తొలగించి గిరీష్‌ను బయటకు తీశారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు పంజాగుట్ట ఎస్‌ఐ నాగరాజు తెలిపారు. అతివేగం ప్రమాదాలకు కారణమవుతున్నాయని ఎస్‌ఐ తెలిపారు. ట్రాఫిక్ ఉన్న ఏరియాల్లో కూడా జాగ్రత్త వహించకపోవడం విచారకరమని ఆయన అన్నారు.

Tags

Next Story