Maharastra: ఆలయంలో ఘోరం.. వందేళ్లనాటి వృక్షం కూలి..

Maharastra: మహారాష్ట్రలోని అకోలా జిల్లాలో భారీ గాలులు, వర్షాల కారణంగా ఆలయ ప్రాంగణంలో ఉన్న 100ఏళ్ల నాటి వృక్షం కూలి ఏడురుగు మరణించారు. ఆ సమయంలో భక్తులు ఆలయ ప్రాంగణంలో ఉన్న ఓ షెడ్డు కింద నిలబడి ఉన్నారు. భారీ గాలుల కారణంగా చెట్టు కూలి షెడ్డు మీద పడింది. దాంతో షెడ్డులోని వారికి తీవ్ర గాయాలయ్యాయి. ఏడుగురు వ్యక్తులు మరణించినట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన 23 మందిని ఆసుపత్రులకు తరలించారు. అత్యవసర చికిత్స అందిస్తున్నారు. బాలాపూర్ తాలూకా పరిధిలోని పరాస్ గ్రామంలోని బాబూజీ మహారాజ్ ఆలయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆదివారం రాత్రి 7.30 గంటల సమయంలో 'మహా హారతి' కోసం ప్రజలు గుమిగూడిన సమయంలో ఈ ప్రమాదం జరిగిందని అకోలా కలెక్టర్ నిమా అరోరా తెలిపారు.
ఈ ఘటనపై రాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం అందజేసేలా చూస్తామన్నారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల పరిహారం, గాయపడిన వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆర్థిక సాయం అందజేస్తామని జిల్లా అధికారులు తెలిపారు. షెడ్డు కింద సుమారు 40 మంది నిలబడి ఉన్నారని జిల్లా యంత్రాంగం తెలిపింది. ఈ ఘటనలో ఐదుగురు పురుషులు, ఇద్దరు మహిళలు మృతి చెందగా, మరో 23 మందికి గాయాలయ్యాయి. వీరిలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారని ఒక ప్రకటనలో తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు మరియు జిల్లా విపత్తు నిర్వహణ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడిన వారిని అకోలా జనరల్ ఆసుపత్రికి తరలించినట్లు జిల్లా యంత్రాంగం తెలిపింది.
ఘటనపై డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ విచారం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి, సీఎం సహాయనిధి నుంచి పరిహారం అందుతుందని ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com